Begin typing your search above and press return to search.

మాల్యా బ్రిటన్ పోలీసులనూ మాయ చేశాడా?

By:  Tupaki Desk   |   25 May 2016 8:48 AM GMT
మాల్యా బ్రిటన్ పోలీసులనూ మాయ చేశాడా?
X
రుణాలు ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా వ్యవహారంలో మరో చిక్కుముడి ఎదురైంది. ఇప్పటికే బ్యాంకులకు - వివిధ సంస్థలకు చుక్కలు చూపిస్తున్న ఆయన ఏం చేశారో ఏమో కానీ, ఆయనకు పంపించిన కోర్టు నోటీసులు తిరుగుటపాలో హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టుకు వచ్చేశాయి. దీంతో ఆయన్ను ఎలా లొంగదీయాలో తెలియక రుణదాతలు తలలు పట్టుకుంటున్నారు.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెక్ బౌన్సు కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. శంషాబాదు ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న జీఎంఆర్ సంస్థకు మాల్యా విమానయాన సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్సు భారీగా బకాయి పడిన సంగతి తెలిసిందే. ఈ బకాయిలను క్లియర్ చేసేందుకు మాల్యా ఇచ్చిన చెక్ బ్యాంకులో బౌన్సయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీఎంఆర్ సంస్థ కోర్టుకెక్కింది. ఈ కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు మాల్యాను దోషిగా తేల్చింది. అయితే నిందితుడు హాజరుకాకుండా శిక్ష విధించలేమన్న కోర్టు... కోర్టుకు రావాలంటూ మాల్యాకు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు తిరుగుటపాలో ఎర్రమంజిల్ కోర్టుకే వచ్చేశాయి. వారెంట్లను చేతబట్టుకుని వాటిలోని అడ్రెస్ కు వెళ్లిన బ్రిటన్ పోలీసులు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ వారెంట్లను ఎర్రమంజిల్ కోర్టుకే తిరిగి పంపించారు.

కాగా బ్రిటన్ లోని విల్లేపార్లే పోలీసులు ఈ వారెంట్లను తీసుకుని మాల్యా ఉంటున్నట్లుగా చెబుతున్న ఇంటికి వెళ్లారట. వారెంట్లలోని అడ్రస్ ప్రకారమే వారు వెళ్లినా అక్కడ ఇంటికి తాళం వేసి ఉండడంతో ఏమీ చేయలేకపోయారు. అయితే.. మాల్యా అక్కడ లేకపోయినా ఆ ఇంటిని మాత్రం బ్రిటన్ పోలీసులు సీజ్ చేశారు. అక్కడ ఎవరూ నివసించడం లేదని ధ్రువీకరిస్తూ ఎర్రమంజిల్ కోర్టుకు సమాచారం పంపించారు. మరి మాల్యా బ్రిటన్ పోలీసులను మాయ చేశాడో లేదంటే అక్కడి నుంచి మకాం మార్చాడో తెలియాల్సి ఉంది.