Begin typing your search above and press return to search.

‘లక్షల’ కోట్లను ‘వేల’ కోట్లకు కొనేశారు

By:  Tupaki Desk   |   26 July 2016 7:50 AM GMT
‘లక్షల’ కోట్లను ‘వేల’ కోట్లకు కొనేశారు
X
తొలితరం ఇంటర్నెట్ వినియోగదారులకు సుపరిచితమైన పేరు యాహు. ఇంటర్నెట్ కొంగొత్తగా వచ్చిన రోజుల్లో ఈమొయిల్స్ పంపుకోవాలనే ప్రతిఒక్కరూ అకౌంట్ తీసుకునేందుకు ఉత్సాహం చూపించింది యాహులోనే. ఇప్పుడంటే జీ మొయిల్ వచ్చింది కానీ అప్పట్లో యాహునే మొనగాడు. ఇక.. ఛాటింగ్ కోసం యాహు ను వినియోగించేవారు. అలాంటి యాహు మెసంజర్.. ఈమొయిల్ తదితర సేవల్ని అందించే విషయంలో తర్వాతి కాలంలో వచ్చిన పోటీదారుల్ని ఎదుర్కొనలేక చతికిల పడిన పరిస్థితి. ఇదే.. ఇప్పుడా కంపెనీని అమ్ముకునేలా చేసిందని చెప్పాలి.

దాదాపు 16 ఏళ్ల క్రితం యాహు మార్కెట్ విలువను రూ.5.6లక్షల కోట్లుగా అంచనా వేసేవారు. అప్పట్లో రూపాయిలో డాలర్ మారకం విలువ కేవలం రూ.40 మాత్రమే. ఇప్పుడు దాదాపు రూ.66.. రూ.67 మధ్యన ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి డాలర్ మారకం విలువతో చూస్తే.. మరింత ఎక్కువగా ఉంటుంది. అంతటి ఖరీదైన కంపెనీ కాలం గడిచే కొద్దీ తన పరపతిని తగ్గించుకుంటూ పోయింది. ఎనిమిదేళ్ల క్రితం కూడా ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపింది. అప్పట్లోకానీ ఈ కంపెనీని అమ్మేసి ఉన్నట్లైయితే.. దాదాపు రూ.1.76 లక్షల కోట్లు అప్పట్లోనే వచ్చి ఉండేవి.

కానీ.. మంచి రేటు ఉన్నప్పుడు అమ్మటానికి ఇష్టపడని యాహు.. ఇప్పుడు అందుకు భిన్నంగా కేవలం రూ.32,160 కోట్లకు అమ్ముకునే దుస్థితి. యాహు ఇంటర్నెట్ వ్యాపారాన్ని అమెరికాకు చెందిన టెలీకామ్ దిగ్గజం వెరిజాన్ కొనేసింది. దాదాపు 20 ఏళ్లు ఇంటర్నెట్ రారాజుగా వెలిగిన యాహు..తర్వాతి కాలంలో కాలానికి తగ్గట్లుగా మారకపోవటంతో మసకబారటమే కాదు.. తాజాగా ఆ కంపెనీ వేరే వారికి అమ్మడు బోయిన పరిస్థితి.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్నిచెప్పాలి. అదృష్టవంతుడ్ని ఎవరూ ఆపలేరని.. దురదృష్టవంతుడ్ని ఎవరూ మార్చలేరన్న దానికి నిదర్శనంగా యాహును చెప్పాలి. ఎందుకంటే.. యాహు ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో ఇప్పుడు మొనగాడైన గూగుల్ ను అమ్మేందుకు ఆ కంపెనీ వద్దకు వచ్చారు. గూగుల్ ను రూపొందించిన లారీ పేజ్.. సెర్గీ బ్రిన్ లు ఇద్దరు యాహును సంప్రదించి తమ కంపెనీని కొనాలని కోరారు. కానీ.. యాహు మాత్రం వద్దు పొమ్మంది. ఒకవేళ కానీ ఆ రోజు గూగుల్ ను కానీ యాహు కొనేసి ఉంటే ఇప్పుడా కంపెనీ పరిస్థితే వేరుగా ఉండేది. ఏది ఏమైనా తాజా డీల్ తో యాహు అధ్యాయం ముగిసిందని చెప్పొచ్చు. కాకుంటే.. లక్షల కోట్ల రూపాయిలు విలువ చేసే కంపెనీని కేవలం వేలాది కోట్లకు అమ్మటం చూసినప్పుడే.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే ఎంతగా నష్టపోతామో యాహు ఉదంతం ఒక పాఠంగా చెప్పొచ్చు.