Begin typing your search above and press return to search.

వెంకయ్య విమాన టిక్కెట్టును క్యాన్సిల్ చేశారు

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:43 AM GMT
వెంకయ్య విమాన టిక్కెట్టును క్యాన్సిల్ చేశారు
X
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. తన విదేశీ పర్యటనల్లో ఏదో ఒక చేదు అనుభవాన్ని చవి చూస్తే వెంకయ్యకు తాజా ఫ్రాన్స్ పర్యటనలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గతంతో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన వాలెట్ చోరీకి గురి కావటం తెలిసిందే.

తాజాగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ వెళ్లిన వెంకయ్యకు.. తాను ప్రయాణించాల్సిన విమాన టిక్కెట్టును క్యాన్సిల్ చేసిన విషయాన్ని.. ప్రయాణానికి కాస్త ముందు తెలుసుకున్నారు. దీంతో షాక్ తిన్న ఆయన.. చివరకు ఆ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా 600 కిలోమీటర్లు కారులో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకోవటం గమనార్హం.

ఫ్రాన్స్ లోని బోర్డెక్స్ సిటీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి వెంకయ్య హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయనకు ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో టిక్కెట్టు బుక్ చేశారు. అయితే.. దీన్ని ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు రద్దు చేశారు. ప్రయాణం ముందు ఈ విషయం తెలిసిన వెంకయ్య దాదాపు 600కిలోమీటర్ల దూరంలో ఉన్న సమావేశ వేదికను చేరుకోవటానికి రోడ్డు మార్గంలో ప్రయాణించారు.

విపరీతమైన వర్షం పడుతున్న వేళ.. కారు ప్రయాణం ఇబ్బంది కలిగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత అధికారులు ఫ్రాన్స్ అధికారులకు ఫిర్యాదు చేయటంతో.. వెంకయ్యకు ఎదురైన ఇబ్బందికి ఫ్రాన్స్ రవాణా మంత్రి క్షమాపణలు చెప్పటంతో పాటు.. దీనికి కారణమైన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాల్ని వెంకయ్య తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. విదేశీ గడ్డ మీద వెంకయ్యకు పెద్ద ఇబ్బందే ఎదురైందని చెప్పక తప్పదు.