Begin typing your search above and press return to search.

ఏపీ మీద వాళ్ల ప్రేమ పొంగిపోతోంది

By:  Tupaki Desk   |   3 May 2016 3:39 PM GMT
ఏపీ మీద వాళ్ల ప్రేమ పొంగిపోతోంది
X
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌ రావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఇపుడు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ బిల్లుకు ప్ర‌వేశ‌పెట్టిన కాంగ్రెస్‌ - మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా టీడీపీ - బిల్లును నెగ్గించాల్సిన స్థితిలో ఉన్న బీజేపీ త‌మ‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్ర‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు త‌న‌దైన శైలిలో చాణ‌క్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

విభజన అనంతరం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తామంటూ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌ లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కేవీపీ రామచందర్‌ రావు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదించిన విషయం విదితమే. ఈ బిల్లుపై పలు దఫాలుగా జరిగిన చర్చ శుక్రవారం తుది దశకు చేరింది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి హరీభాయి చౌదరి సమాధానమిస్తూ, విభజన చట్టలో ఇచ్చిన పలు హామీలను ఎన్‌ డిఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. పది ఉన్నత స్థాయి సంస్థలు - విద్యా సంస్థలను ఏర్పాటు చేయటంతోపాటు రాష్ట్రానికి దాదాపు తొంబై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశామని ఆయన చెప్పారు. మంత్రి చాలా విస్తృతమైన సమాధానం ఇచ్చినందున రామచందర్‌ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విజ్ఞప్తి చేశారు. ఈ దశలో తెలుగుదేశం సభ్యుడు లేచి సభలో కోరంలేనందున బిల్లుపై చర్చ కొనసాగించటం మంచిది కాదన్నారు. దీంతో రామచందర్‌ రావు మాట్లాడుతూ, మొదట సభలో కోరం ఉండేలా చూడాలని, ఆ తర్వాతే తాను మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఐదు నిమిషాల పాటు గంట మోగించినప్పటికీ కోరం లేకపోవడంతో ప్యానల్ చైర్మన్ సభను వాయిదా వేయవలసి వచ్చింది. కోరం లేకపోవటంతో మధ్యలోనే ఆగిపోయిన రామచందర్‌ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వచ్చే శుక్రవారం ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి.

ప‌రిణామాలు ఈ విధంగా ఉండ‌గా...తన బిల్లుపై ఓటింగ్ జరపవలసిందేనని కేవీపీ పట్టుపడుతున్నారు. ఆయన వాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. అయితే కేవీపీ ప్రతిపాదించింది ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి దానితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కొంతమంది నాయకులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా తనను కలిసిన కొందరు విలేకరులతో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కేవీపీది ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి అది రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ దానిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని చెబుతున్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లులను ఆమలు చేయాలనే నిబంధన లేదని తేల్చేశారు.

అయితే ఏపికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలన్న ఈ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే ఆ తర్వాత ఏమవుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామచందర్‌ రావు బిల్లును ప్రభుత్వం అమలు చేయకపోయినా దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. మ‌రోవైపు ఆ ప్ర‌యోజ‌నాల‌ను కాంగ్రెస్ సైతం సొంతం చేసుకోవ‌చ్చున‌ని భావిస్తున్నారు.