Begin typing your search above and press return to search.

మోడీనే ఏపీ దేవుడని చెప్పిన వెంకయ్య

By:  Tupaki Desk   |   27 May 2016 11:36 AM GMT
మోడీనే ఏపీ దేవుడని చెప్పిన వెంకయ్య
X
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా - ప్ర‌త్యేక ప్యాకేజీ ఇత‌ర‌త్రా అంశాల‌పై జ‌రుగుతున్న చ‌ర్చ‌కు కేంద్ర పట్టణాభివృద్ధి - పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు త‌న‌దైన శైలిలో ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సంధర్భంగా కొందరు విలేక‌రులతో మాట్లాడిన ఆయన ప్ర‌త్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ప్ర‌స్తుత క‌ష్టాల‌కు యూపీఏ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని తేల్చారు.

రాష్ట్ర విభజన బిల్లులోనే హోదా అంశాన్ని గత యూపీఏ ప్రభుత్వం చేర్చి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదని వెంక‌య్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక గుర్తింపును కేంద్రం ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ ఇచ్చామని అన్నారు. ఏపీ తమకు ప్రత్యేక రాష్ట్రామని ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా అంశాన్ని నరేంద్ర మోడీ దృష్టికి తెస్తే ఆయన దీనిని నీతి ఆయోగ్‌ కు అప్పగించారని వెల్లడించారు. పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేదని, అయితే బడ్జెట్ లోటు ఉన్న రాష్ట్రాలకు లోటు భర్తీకి ఆర్థిక సహాయం చేయాలని సిఫారసు చేసిందని వివరించారు. ఆ సిఫారసుల మేరకే ఏపీకి ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చాలా రాష్ట్రాలు మద్దతు ఇస్తున్నప్పటికీ తమకూ ఆ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయని వెంకయ్య నాయుడు తెలిపారు. ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో ఏం చేయగలుగుతామనే విషయం ప్ర‌ధాన‌మంత్రి పరిశీలనలో ఉందని తెలిపారు.

ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదంటున్న కాంగ్రెస్ నాయకులు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టారని వెంక‌య్యనాయుడు నిలదీశారు. ప్ర‌ధాని నరేంద్ర మోడీతోపాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా హోదా అంశాన్ని పరిశీలిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి సహాయం చేయకపోతే హోదా ఇచ్చినా ఫలితం ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుందని ఉద్ఘాటించారు. ప‌ది సంవత్సరాల ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన తాను ఇప్పుడు ఏమీ చేయటం లేదంటూ వస్తున్న విమర్శల్ని వెంకయ్యనాయుడు కొట్టివేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని కర్నాటక - తమిళనాడు - ఓడిశా తదితర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, దీని వల్ల తమ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతాయని కర్నాటకకు చెందిన సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ లోక్‌ సభలో చెప్పిన విషయాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అభిప్రాయంతో కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఏపీపికి హోదా ఇచ్చేందుకు బిల్ అవసరం లేదని, పొలిటికల్ విల్ కావాలని ఉద్ఘాటించారు. బిల్లులో హోదా అంశాన్ని పొందుపరచి ఉండాల్సిందని, అది లేనప్పుడు ప్రణాళికా సంఘం ఆమోదించాలని - ఇది కూడా జరగనప్పుడు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదాను సిఫారసు చేయవలసి ఉంటుందన్నారు. అయితే ఇందుకు జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం లభించటం అంత సులభం కాదని, అక్కడ ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తాయన్నారు. అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే ఇక మిగిలేదీ ఏమిటని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పెద్దగా జరగలేదని గుర్తు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్ర మంత్రులు - బీజేపీ నాయకులే చెబుతున్నారని విలేక‌రులు గుర్తు చేయగా, ఈ అంశాన్ని పరిశీలించాల్సింది ప్రధాని లేదా ఆర్థిక శాఖ మంత్రి మాత్రమేనని వెంక‌య్య‌నాయుడు చెప్పారు. పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసులను దృష్టిలో పెట్టుకుని వారలా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని తాను చెప్పడం లేదని, వస్తే బాగుంటుందని మాత్రమే అంటున్నానని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే లాభం లేదని, అది హోదాగానే మిగిలిపోతుందని చెప్పారు.