Begin typing your search above and press return to search.

వెంకయ్య ఏపీ నుంచి ఎన్నికల్లో దిగగలరా?

By:  Tupaki Desk   |   3 Oct 2015 10:30 PM GMT
వెంకయ్య ఏపీ నుంచి ఎన్నికల్లో దిగగలరా?
X
'పనోడు పందిరి వేస్తే పిచికలు పడదోసాయని' సామెత! అదే తరహాలో 'మనోడు మంచోడు కదా.. మన కోసం పోరాడాడు కదా.. అని నిన్న మురిసిపోతే.. ఆ మురిపెం మరచిపోకముందే.. 'మనోడు' వంచనకు తెరలేపుతున్నాడు. మన రాష్ట్రంనుంచి కేంద్రంలో చక్రం తిప్పగల కీలక స్థానంలో ఉన్న సీనియర్‌ నాయకుడు.. మన రాష్ట్రానికి ద్రోహం ఎందుకు చేస్తాడులే అని మనం అనుకుంటాం గానీ.. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన మాటల్లో వంచనాశిల్పం అడుగడుగునా బయటపడుతోంది. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కంటె ప్యాకేజీ రావడం వల్లనే ఎక్కువ మేలు జరుగుతుందని సెలవిచ్చారు. రాష్ట్రానికి హోదా కంటె ప్రాజెక్టులు చాలా ముఖ్యం అని ఆయన వక్కాణించారు.

ఇదే వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన చట్టం పార్లమెంటు ఆమోదానికి వచ్చినప్పుడు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభలో ప్రత్యేకహోదా గురించి పోరాడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయిదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తాం అని ప్రధాని మన్మోహన్‌ ప్రకటిస్తే.. 'అనాధలాగా ఏర్పడబోయే రాష్ట్రానికి అయిదేళ్లు ఏం సరిపోతుంది.. పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే' అంటూ పోరాడిన వెంకయ్య అధికారంలోకి రాగానే ఒరగబెడతాం అనుకుంటాం గానీ.. హోదా సంగతి వచ్చిన ప్రతిసారీ ఆయన మాయమాటలతోనే కాలం గడిపేస్తున్నారు. ఈ పాత విషయాలను గుర్తు చేసుకోవడం చర్విత చరణమే.

అయితే తాజాగా ఆయన ప్రత్యేకహోదా కంటె రాష్ట్రానికి ప్రాజెక్టులే ముఖ్యం అని చెబుతున్నారు కదా! ఇలాంటివి మాయమాటలు గా పరిగణిచే వారికి ఒక సందేహం కలుగుతోంది. ''వెంకయ్య గారూ! నిన్న పదేళ్లు హోదా కావాలని మీరంటే అదే మంచిదని మేం అనుకున్నాం. ఇవాళ హోదాలో ఏముంది ప్యాకేజీ, ప్రాజెక్టులు వస్తే చాలు అని తమరంటే ఇదే నిజం అని నమ్ముతాం. ఇంకా మీరు ఎన్నిరకాలుగా మాట మార్చినా కూడా.. మీ మాటలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని ఉద్దేశించినవే తప్ప.. ఎలాంటి మాయతో కూడినవి కాదని మేం విశ్వసిస్తాం. కానీ మీ మాటలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు విశ్వసించారో లేదో లిట్మస్‌ టెస్ట్‌ చేసుకోవడానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ రాష్ట్రంనుంచి ఎంపీగా ఎన్నికల బరిలో దిగే దమ్ము మీకుందా? అని మేం అడుగుతున్నాం.'' అని వారు అంటున్నారు.

వెంకయ్యనాయుడు వైఖరి ఎలా ఉన్నదంటే.. ''ఇక తను జీవితంలో ఎన్నటికీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ప్రజల ఓట్లతో నెగ్గి పార్లమెంటుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తదు. నిరంతరమూ మోడీ భజన చేసుకుంటూ.. ఆయన మనసులో తలచిన దానికి అనుగుణంగా తాను నడచుకుంటూ ఉంటే చాలు.. భాజపా కేంద్రంలో ఏలుబడి సాగిస్తూ ఉన్నా లేకపోయినా.. తాను జీవించి ఉన్నంతకాలమూ ఎక్కడో ఒక రాష్ట్రంనుంచి తమ పార్టీ తనను రాజ్యసభకు ఎంపీగా పంపేస్తూ ఉంటుంది..'' అని అనుకుంటున్నట్లుగా ఉంది. ఎటూ ప్రజల ఓట్లతో తనకు పనిలేనప్పుడు ఇక వారిని ఎన్ని రకాలుగా మోసం చేస్తే ఏముందిలే అని ఆయన ఫిక్సయినట్లుగా ఉంది. అందుకే హోదా విషయంలో ఇన్ని రకాలుగా మాట మారుస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.