Begin typing your search above and press return to search.

అద్వానీతో గట్టిగా ఓకే.. మరి మోడీ మాటేంటి?

By:  Tupaki Desk   |   28 Sep 2016 7:44 AM GMT
అద్వానీతో గట్టిగా ఓకే.. మరి మోడీ మాటేంటి?
X
రాజకీయం కరుకైనది. అందుకే సున్నిత మనస్కులు రాజకీయాలకు దూరంగా ఉండాలని చెబుతారు. తామెంత సున్నితంగా.. భావోద్వేగంతో ఉంటామని రాజకీయ నేతలు చెబుతుంటారు కానీ.. వారి మాటలు.. తీసుకునే నిర్ణయాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఎవరి దాకానో ఎందుకు కేంద్రమంత్రి.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడి వ్యవహారాన్నే తీసుకోండి. ఏపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ.. ఢిల్లీలో కథ నడిపిస్తున్న వెంకయ్య చెబుతున్నతాజా మాటలు వింటున్నారా?

ఏపీకి ఎంతో చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్న ఆయన.. ఏపీ కోసం బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీతో గట్టిగా మాట్లాడిన ముచ్చట చెప్పుకొస్తున్నారు. అద్వానీ నీడన పెరిగిన వెంకయ్య.. ఇప్పుడు ఆయనతోనే తాను గట్టిగా మాట్లాడానన్న మాట చెప్పటం ద్వారా ఏపీ విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించుకునే ప్రయత్నం చేశారే తప్పించి.. అంత పెద్దమనిషిని చిన్నబుచ్చినట్లుగా అస్సలు అనుకోవటం కనిపించదు. ఒకవేళ వెంకయ్య చెప్పినట్లుగా ఏపీ ప్రయోజనాల విషయంలో వేలెత్తి చూపించలేరన్నది నిజమే అనుకుంటే.. మరి ఈ మేర‌ కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి.. అద్వానీ లాంటి నేతతోనే గట్టిగా మాట్లాడిన వ్యక్తికి మోడీతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం పెద్ద విషయం కాకూడదు.

మరి.. మోడీతో ఆయన ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదు. హోదాతో పోలిస్తే.. ప్రత్యేక ప్యాకేజీనే సూపర్ అంటున్న వెంకయ్య మాటలే నిజం అనుకుంటే.. టీడీపీకి చెందిన పారిశ్రామికవేత్తలైన రాజకీయ నేతలు పలువురు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో తమ వ్యాపార విస్తరణను ఎందుకు చేపడుతున్నట్లు? రాజకీయ నేతలుగా ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేసే వారు.. వ్యక్తిగతంగా మాత్రం తమ వ్యాపారాల్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు విస్తరిస్తున్నట్లు? అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పగలిగితే సరిపోతుంది.

ఏపీ విషయంలో వెంకయ్యకు కమిట్ మెంట్ లేదని చెప్పటం మా ఉద్దేశం కాదు. కానీ.. మాటల్లో చెప్పే కమిట్ మెంట్ కు.. చేతలకు మ్యాచ్ కావటం లేదన్నదే మా వాదన. అదే సమయంలో.. అద్వానీ పేరును తెరపైకి తీసుకొచ్చి మరీ.. తన హీరోయిజాన్ని ప్రదర్శించుకోవాలని భావిస్తున్న వెంకయ్య..బీజేపీలో తన స్థాయి గురించి చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇదంతా మోడీ అండ చూసుకొని మాత్రమేనని చెప్పక తప్పదు. ఆంధ్రాకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళతానని తాను చెప్పినట్లుగా పేర్కొంటున్న‌ వెంకయ్య.. హోదా విషయంలో ఎంతవరకు వెళ్లారో చెబితే బాగుంటుంది? ఇక్కడ మరోసారి చెప్పేదేమిటంటే.. వెంకయ్య ఏమీ చేయలేదని చెప్పటం లేదు. కానీ.. చేస్తున్నది ఏపీకి ఏ మాత్రం సరిపోవన్నది మాత్రమే మా ఉద్దేశం. హోదాను నూటికి నూరు శాతం నిజాయితీతో ఏపీలో అమలు చేస్తే.. ఏపీ స్వరూపం ఎంతలా మారిపోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. అలాంటి విషయాల గురించి నిజాలు మాట్లాడని వెంకయ్య లాంటి వారు.. ఏపీకి ఎంతో చేస్తున్నామని చెప్పటమే అసలు ఇబ్బంది. అద్వానీతో గట్టిగా మాట్లాడానని ఇప్పుడు చెబుతున్న వెంకయ్య.. పదేళ్ల కిందట ఇంతే పవర్ ఫుల్ గా సదరు బీజేపీ ఉక్కుమనిషి గురించి వ్యాఖ్యలు చేయగలిగేవారా..?