Begin typing your search above and press return to search.

బాబు క‌ల‌ల‌కు బ్రేకు వేసిన వెంక‌య్య‌

By:  Tupaki Desk   |   30 April 2017 10:41 AM GMT
బాబు క‌ల‌ల‌కు బ్రేకు వేసిన వెంక‌య్య‌
X
2018లోనే ఎన్నిక‌లు రాబోతున్నాయి. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేంద్రం సిద్ధ‌మ‌యింది. అందుకే మీరు సిద్ధంగా ఉండాలి- ఇది ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నేత‌ల‌తో చెప్పిన జోస్యం. అయితే ఇదంతా తూచ్ అని బాబు స‌న్నిహితుడ‌నే పేరున్న కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు కొట్టిపారేశారు. తాజాగా హైద‌రాబాద్‌ లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు రావచ్చంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని, వాటిల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని కుండ‌బ‌ద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఏ రాష్ట్రానికీ ముందుగానే ఎన్నికలు వస్తాయని తాను భావించడం లేదని వెంకయ్యనాయుడు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఏక కాలంలో పార్లమెంట్-అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న ఆలోచనపై కూడా వెంక‌య్య నాయుడు రియాక్ట‌య్యారు. ఈ ప్ర‌తిపాద‌న మంచిదేన‌ని పేర్కొంటూ అది అమల్లోకి రావడానికి ఎంతో కాలం పట్టవచ్చని వెంక‌య్య విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బాహుబలి ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీయే అని వెంకయ్యనాయుడు స్ప‌ష్టం చేశారు. కాగా, మే1 నుంచి అమ‌ల్లోకి రానున్న రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ-అభివృద్ధి చట్టం గురించి ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి అయిన వెంకయ్యనాయుడు వివ‌రిస్తూ కాంగ్రెస్ పై మండిప‌డ్డారు. ఈ చట్టాన్ని 2008లో తెరమీదకు తెచ్చినా కాంగ్రెస్‌ పార్టీ ఏమీ చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. తాము ప్ర‌జ‌ల సంక్షేమంలో భాగంగా ఈ చ‌ట్టాన్ని ఆమోదింప‌చేసి అమ‌ల్లోకి తెస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇక నుంచి బిల్డర్లు తాము చేయబోయే నిర్మాణాల గురించి ముందుగా మీడియాలో, పుస్తకాల్లో, ప్రకటనల్లో ఎలాంటి అంశాలు చెప్పారో వాటన్నింటిని కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుందని, వాటిని పాటించాలని సూచించారు. ఈ చ‌ట్టం ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున మేలు చేసేద‌ని వెంక‌య్య‌నాయుడు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/