Begin typing your search above and press return to search.

రాజ‌స్థాన్ కోట‌లో అరుదైన దృశ్యం

By:  Tupaki Desk   |   17 Dec 2018 3:15 PM GMT
రాజ‌స్థాన్ కోట‌లో అరుదైన దృశ్యం
X
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ కల్యాణ్ సింగ్.. అశోక్ గెహ్లాట్ - సచిన్ పైలట్ చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జైపూర్ లోని చారిత్రక భవనం అల్బర్ట్ హాల్ లో ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ - హెచ్ డీ దేవేగౌడ - మల్లిఖార్జున్ ఖర్గే - పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి - పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ - హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మై దృశ్యం క‌నిపించింది.

రాజ‌స్థాన్ సీఎంగా ప‌నిచేసి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన బీజేపీ నేత వ‌సుంధ‌రా రాజే సింధియా - మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి పీఠం కోసం శ‌త‌విధాల ప్ర‌య‌త్నం చేసి నిరాశ ప‌డిన కాంగ్రెస్ యువ‌నేత జ్యోతిరాదిత్య సింధియా ఈ సంద‌ర్భంగా ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ఒకే వేదిక‌పై క‌లిసిన ఈ ఇద్ద‌రు నేత ఆత్మీయ ప‌ల‌క‌రింపు పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డం ద్వారా వ‌సుంధ‌ర నిరాశ‌లో ఉండ‌గా...మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి త‌న‌కు ద‌క్క‌క‌పోవ‌డంతో జ్యోతిరాధిత్య ఒకింత నారాజ్ అయ్యారు. సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్‌కు మ‌ధ్య‌ప్రదేశ్ సీఎం పీఠం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

కాగా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం పీఠం విషయంలో మూడుదశాబ్దాల తర్వాత చరిత్ర పునరావృతమైంది. నాడు కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా, నేడు ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా.. ఇద్దరికీ ముఖ్యమంత్రి పీఠం అందని ద్రాక్షగానే మిగిలింది. 1989లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్.. చుర్హత్ లాటరీ కుంభకోణంలో చిక్కుకున్నారు. దాంతో ఆయన గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా కొనసాగుతున్న మాధవరావు సీఎంగా తననే ఎంపిక చేస్తారని భావించారు. అయితే సీఎం పదవి ఆయనకు దక్కకుండా అధిష్టానం వద్ద అర్జున్ సింగ్ చక్రం తిప్పడంతో మాధవరావు సింధియాకు నిరాశే మిగిలింది. తన తండ్రికి ఎదురైన చేదు అనుభవాన్ని 29ఏండ్ల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కూడా చవిచూడాల్సి వచ్చింది. 15 ఏళ్ల‌ విరామం తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నా.. జ్యోతిరాదిత్యకు నిరాశే మిగిలింద‌ని అంటున్నారు.