Begin typing your search above and press return to search.

వైఎస్ జ‌గ‌న్‌ కు నోటీసులు...అంతా ఉత్త‌దేన‌ట‌

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:31 PM GMT
వైఎస్ జ‌గ‌న్‌ కు నోటీసులు...అంతా ఉత్త‌దేన‌ట‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత - ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లను కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌ గా తీసుకుంది. దీంతో ఆయ‌నకు నోటీసులు అందాయి....ఇది ఉద‌యం నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల ప్ర‌చారం. ఒక‌ద‌శలో వైసీపీ శ్రేణులు సైతం ఢీలా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్‌ ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ క్లారిటీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. పచ్చ ఛానళ్లు చేసే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని - ఓటర్లను మభ్యపెట్టేందుకు టీడీపీ ఆడుతున్న మైండ్‌ గేమ్‌ అని - దీనిపై ఎన్నికల కమీషన్‌ కు ఫిర్యాదు చేశామని పద్మ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని వైఎస్‌ ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రచారం చేయిస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు.

పోలింగ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఉదయం నుంచి చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానళ్లతో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ కు ఈసీ నోటీసులు ఇచ్చిందంటూ ఓటర్లను ప్రభావితం చేయడానికి మైంట్‌ గేమ్ ఆడారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వాస్తవానికి వైఎస్‌ జగన్‌ కు ఎలాంటి నోటీసులు అందలేదని ఆమె స్ప‌ష్టం చేశారు. ఇలాంటి దుష్ప్ర‌చారం చేసి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన చంద్రబాబు, తప్పుడు ప్రసారాలు చేసిన మీడియా ఛానళ్లపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ ప్రతిపక్షానికేనా.. అధికార పార్టీకి వర్తించదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పోలీంగ్‌ బూత్‌ లోకి టీడీపీ నేతలు - అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి - ఆయన సోదరి మౌనిక బూత్‌ కు వెళ్లి ఓటర్లను - ఏజెంట్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

కోడ్‌ ఉందని తెలిసి కూడా చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ పెట్టి వీధి రౌడీలా ప్రతిపక్షనేతపై విమర్శలు చేశారని ప‌ద్మ మండిప‌డ్డారు. ఓటర్లను బెదిరిస్తూ శిల్పా మోహన్‌ రెడ్డి ఇంటిపై రాత్రి స‌మ‌యంలో సీఎం చంద్రబాబు పోలీసులతో దాడులు చేయించారన్నారు. పోలింగ్‌ ఏజెంట్లకు ఫారాలు కూడా ఇవ్వనివ్వకుండా చేశారన్నారు. వైఎస్‌ ఆర్‌ సీపీ అభ్యర్థి నుంచి - పార్టీ నాయకులు - కార్యకర్తలను నిర్బంధించేందుకు కుట్రలు చేశారన్నారు. చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయడానికి వచ్చారన్నారు. ఒక పక్క పోలింగ్‌ జరుగుతుంటే మరోపక్క వీధుల్లో తిరుగుతూ టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నా.. పోలీసులు - అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నంద్యాల ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌ లో పాల్గొంటున్నారని, మోసపూరిత చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఓటు వేసేందుకు బారులు తీరారన్నారు. వైఎస్‌ ఆర్‌ సీపీ ఘన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.