Begin typing your search above and press return to search.

దేవెగౌడ-వాజుభాయ్.. ప్రతీకారం కథ..

By:  Tupaki Desk   |   17 May 2018 8:24 AM GMT
దేవెగౌడ-వాజుభాయ్.. ప్రతీకారం కథ..
X
కర్ణాటకలో బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లినా కాంగ్రెస్ కు ఎలాంటి ఊరట లభించలేదు. బీజేపీ మెజార్టీ ఫిగర్, మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల లేఖను తమకు ఇవ్వాలని చెప్పిన సుప్రీం కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో శుక్రవారం ఏమవుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

అయితే ఇప్పుడు బీజేపీ... కర్ణాటకలో జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడి సీఎం ఆశలపై నీళ్లు చల్లినట్టే దేవెగౌడ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గతంలో డిస్మిస్ చేయించారు. 1996లో ప్రధానిగా ఉన్న దేవెగౌడ.. రాష్ట్రపతిని సహాయంతో గుజరాత్ ప్రభుత్వాన్ని అల్లర్లు సాకుగా చూపి డిస్మిస్ చేయించారు. అప్పుడే శంకర్ సింగ్ వాఘేటా బీజేపీని చీల్చి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో విశేషం ఏంటంటే ఇప్పుడున్న కర్ణాటక గవర్నర్ వాజుభాయ్.. 1996లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. నాడు దేవెగౌడ, కాంగ్రెస్ కుట్రకు బీజేపీ ప్రభుత్వం, వాజుభాయి బలైతే.. నేడు అదే వాజుభాయ్ , బీజేపీ కుట్రకు దేవెగౌడ బలైపోయారు.

దేవగౌడ, కాంగ్రెస్ తో జతకలిసి తన కొడుకు కుమారస్వామిని సీఎం చేద్దామనుకుంటే పాతపగలు మనసులో పెట్టుకున్నాడో ఏమోకానీ గవర్నర్ వాజుభాయ్ దేవెగౌడకు అనుకోని షాక్ ఇచ్చాడు. జేడీఎస్ ను కాదని బీజేపీకి కర్ణాటక పీఠం అప్పజెప్పారు. నాడు చోటుచేసుకున్న విషయాన్ని సీ ఓటర్ చీఫ్ ఎడిటర్ యశ్వంత్ దేశ్ ముఖ్ ట్వీట్ ద్వారా అందరికీ తెలియజేశారు.

దేశ్ ముఖ్ ట్వీట్ చేస్తూ.. ‘1996లో ప్రధాని దేవెగౌడ సలహాతో రాష్ట్రపతి గుజరాత్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. నాడు బాధితుడైన వాజుభాయ్.. నేడు అదే రివేంజ్ తీర్చుకున్నాడు. దేవెగౌడకు షాక్ ఇచ్చారు. కర్మ ఫలితం అంటే ఇదే’ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా దేవెగౌడ చేసిన పొరపాటు ఇప్పుడు ఆయన కొడుకుకు సీఎం సీటును దూరం చేసిందని విశ్లేషణలు మొదలయ్యాయి.