Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై పోటీ చేసినాయ‌న పార్టీ వీడుతున్నాడా?

By:  Tupaki Desk   |   13 Dec 2017 4:38 PM GMT
కేసీఆర్‌ పై పోటీ చేసినాయ‌న పార్టీ వీడుతున్నాడా?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వ‌రుస షాక్‌ లు త‌లుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభ‌జన ఉద్య‌మం నుంచి మొద‌లైన ఈ వ‌ల‌స‌లు..2014 ఎన్నిక‌ల త‌ర్వాత మరింత పుంజుకున్నాయి. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్ప‌డంతో... పెద్ద ఎత్తున్నే నాయ‌కులు టీడీపీని వీడారు. ఈ ప‌రిణామం నుంచి టీడీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీకి మ‌రో షాక్ త‌గిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు - మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి తన రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

నిన్న ఉమామాధవ రెడ్డితోపాటు ఆమె కుమారుడు - భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ మ‌రుస‌టి రోజే ఆమె టీడీపీకి గుడ్ బై చెపుతూ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాలు వెల్ల‌డించారు. గ‌త్యంతరం లేని ప‌రిస్థితుల్లో తాను పార్టీ మారుతున్న‌ట్లు చెప్పారు. అయితే మాజీ మంత్రి - సీనియ‌ర్ నేత అయిన ఉమా మాధ‌వ‌రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్ప‌డం చూస్తుంటే...ఆ పార్టీలో మ‌రికొంద‌రు నేత‌లు టీడీపీని వీడ‌టం ఖాయ‌మంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వినిపిస్తున్న పేరు....గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ పై పోటీ చేసిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి.

గత ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ప్ర‌తాప‌రెడ్డి పార్టీ బ‌లోపేతం కోసం ప‌నిచేస్తున్నారు అయితే పార్టీ బ‌ల‌ప‌డే అవ‌కాశం లేక‌పోవ‌డం స‌హా ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల ఆయ‌న కాంగ్రెస్‌ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. గజ్వేల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడంతో ఒంటేరు ప్రతాప రెడ్డితో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం చర్చలు జరిపినట్టు తెలిసింది. రాహుల్‌ గాంధీని పిలుపు వచ్చిన వెంటనే ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమని అంటున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి పార్టీ మారిన స‌మ‌యంలోనే...ఆయ‌న‌తో పాటుగా రేవంత్ రెడ్డి కూడా చేరిపోతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది వాయిదా ప‌డింది. అనంత‌రం కాంగ్రెస్ పార్టీ చ‌ర్చ‌ల‌ ఫ‌లితంగా ఒంటేరు త‌న నిర్ణ‌యం మార్చుకొని టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు డిసైడ‌యిన‌ట్లు స‌మాచారం.