Begin typing your search above and press return to search.

సీనియర్ నేతలకు బీపీ పెరుగుతోందా...?

By:  Tupaki Desk   |   25 March 2017 7:36 AM GMT
సీనియర్ నేతలకు బీపీ పెరుగుతోందా...?
X
పాలిటిక్సు అంటే ప్రెజర్ కాస్త ఎక్కువే. పైగా ఎండలు ముదిరిపోయాయి. దీంతో రాజకీయ నేతలకు బీపీ పెరిగిపోయి చేయి జోరు పెరుగుతోందట. అధికారంలో ఉండి బిజీబిజీగా ఉంటే పని ఒత్తిడి వల్ల బీపీ.. అదేసమయంలో అధికారానికి దూరమై ఖాళీగా ఉంటూ గోళ్లు గిల్లుకుంటున్నవారికి అధికారం లేదన్న మనోవేదనతో బీపీ పెరుగుతోందట. ఏ పనీ లేక.. ఎవరూ తమను పట్టించుకోక.. మైకు పట్టుకుని ఊదరగొట్టినా మీడియాలో సింగిల్ కాలమ్ కూడా కనిపించక.. ఇప్పుడప్పుడే అధికారంలోకి వస్తామన్న నమ్మకమూ కుదరక నిత్యం మథనపడడం వల్ల కూడా బీపీ వస్తుందట కొందరికి. ఇలా బీపీ పెరిగిపోయి వారు సొంత కార్యకర్తలను - అధికారులను.. ఇలా ఎవరిని పడితే వారిని కొట్టి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ ఇలాగే ఓ అధికారిపై తన కోపమంతా చూపించారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విధుల్లో ఉన్న ఏఎస్‌ ఐను దూషించారు. మీడియాతో మాట్లాడేందుకు పాయింట్‌ వద్దకు వీహెచ్‌ రాగా, అందుకు అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న అదనపు ఇన్‌ స్పెక్టర్‌ అడ్డుకున్నారు. దీంతో వీహెచ్‌ విచక్షణ మరిచి ఇన్‌ స్పెక్టర్‌ పై దూషణలకు దిగారు. మీడియా పాయింట్‌ వద్ద ప్రస్తుత సభ్యులే మాట్లాడాలని, మాజీలకు అవకాశం లేదని, అందువల్ల వెళ్లిపోవాలని అధికారి చెప్పడంతో వీహెచ్‌ కు బీపీ పెరిగిపోయిందట.. ‘అరే.. నువ్వు ఎవడ్రా బై నాకు చెప్పేది!. నన్నే అడ్డుకుంటావా?. ఆరేయ్‌.. నీ అంతు చూస్తా.. మేం మాట్లాడానికి కూడా మీ అనుమతి తీసుకోవాలా?. ఇదేనా ప్రజాస్వామ్యం?.’ అంటూ నిప్పులు చెరిగారు. దీంతో ఏఎస్‌ ఐ సోషల్‌ మీడియాలో సీనంతా వివరించారు. వీహెచ్‌ తనను దూషించారని, దళితుడైనందు వల్లే ఇలా చేశారని , ఉన్నతాధికారులకు ఫిర్యారు చేసినా పట్టించుకోలేదని ఆవేదన చెందారు. సైఫాబాద్‌ ఠాణాలో కేసు కూడా పెట్టారు.

ఇంకో సీనియర్ లీడర్ అయితే ఏకంగా పార్టీ కార్యకర్తనే కొట్టారు. ఆయనెవరో కాదు తెలంగాణ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి. హైద‌రాబాద్‌ లోని గోషామ‌హల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ ఎస్ స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌భ‌లో తొలుత మాట్లాడిన హోంమంత్రి నాయిని అనంత‌రం నంద‌కిషోర్ వ్యాస్ అనే కార్య‌క‌ర్త‌కు మైక్ ఇచ్చారు. దీనికి మ‌రో కార్య‌క‌ర్త ఆర్‌.ఎ.మ‌హేంద‌ర్ అభ్యంత‌రం తెలిపారు. నంద‌కిషోర్‌ కు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నార‌ని నిల‌దీశారు. దాంతో సీరియస్ అయిన మంత్రి ఒక్క‌సారిగా మహేంద‌ర్‌ పై చేయిచేసుకున్నారు. నీ సంగ‌తి చూస్తా.. అని హెచ్చ‌రించారు. దీంతో మ‌హేంద‌ర్‌ కు ప‌లువురు మ‌ద్ద‌తుగా నిలిచి నాయినితో వాగ్వాదానికి దిగారు.

మొత్తానికి సీనియర్ లీడర్లంతా ఇలా ఊరికే బీపీ తెచ్చుకుని ఆ కోపాన్ని అందరిపైనా చూపిస్తున్నారు. అసలే వేసవి కాలం. కాస్త కూల్ గా ఉంటే పోయేదేం లేదు కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/