Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో నో వేకెన్సీ బోర్డ్‌

By:  Tupaki Desk   |   13 Feb 2016 3:53 AM GMT
టీఆర్ ఎస్‌ లో నో వేకెన్సీ బోర్డ్‌
X
తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరిక‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మొద‌లైన సంద‌డి ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత పీక్ స్టేజీకి చేరిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు వ‌రుస‌బెట్టి జంప్ అవుతున్న ప‌రిస్థితి. ఏకంగా పార్టీ ఫ్లోర్‌ లీడ‌ర్‌ గా ఉన్న ఎర్ర‌బెల్లి లాంటి వారు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌సంగం ముగించిన‌ కొద్దిసేప‌టికే కండువా మార్చుకున్న రాజేంద‌ర్‌ రెడ్డిలాంటి వారు త‌మ జంపింగ్‌ లతో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించారు. అయితే ఈ చేరిక‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ వి.హనుమంతరావు త‌న‌దైన శైలిలో జోక్ పేల్చారు.

రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతల చేరికతో టీఆర్ ఎస్ పార్టీ ఓవర్ లోడ్ అయిందని వీహెచ్ వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ లో చేరిన టీడీపీ నేతలను అక్కడ సెకండ్ సిటిజన్లుగానే పరిగణిస్తారని ఆయ‌న జోస్యం చెప్పారు. టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొంటూ గౌరవం లేని చోటుకు ఎందుకు వెళ్లడమంటూ టీఆర్ ఎస్ కండువా కప్పుకున్న టీడీపీ నేతలను ఆయ‌న ప్రశ్నించారు. జాతీయ దృక్ప‌థ‌మే కాకుండా ప్ర‌జాస్వామ్య స్వేచ్చ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని వీ హనుమంతరావు టీడీపీ నేత‌లకు ఉచిత సలహా ఇచ్చారు.

టీఆర్ ఎస్‌ పై ఇన్ని విమ‌ర్శ‌లు చేసిన హనుమంతరావు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని ఓబీసీకి ఇవ్వడం అభినందనీయమంటూ టీఆర్ ఎస్‌ ను మెచ్చుకోవ‌డం విశేషం. బ‌డుగుల‌కు అభివృద్ధిలో భాగ‌స్వామ్యం అయ్యే అవ‌కాశం దొరికింద‌ని మేయ‌ర్ పీఠం గురించి వీహెచ్ వ్యాఖ్యానించారు.