Begin typing your search above and press return to search.

నిజంః గంగాన‌దికి హైకోర్టు నోటీసులు!

By:  Tupaki Desk   |   30 April 2017 10:39 AM GMT
నిజంః గంగాన‌దికి హైకోర్టు నోటీసులు!
X
మ‌న‌ దేశంలోని ప్రధాన జీవనదుల్లో పెద్దదైన గంగానదికి ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత నెలలో గంగా, యమునా నదులకు హైకోర్టు జీవించి ఉన్న వ్యక్తుల హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. గంగానదికి ఇరువైపులా చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని గంగానదిని కోరింది. కాగా ఒక నదికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం ఇదే ప్రథమం.

కాగా, గ‌త నెల‌లో ఉత్త‌రాఖండ్ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. భార‌త నాగ‌రిక‌త గంగ‌తోనే మొద‌లైంద‌ని, దేశంలో తొలి జీవించి ఉన్న ప్రాణి (Living Entity) గంగేన‌ని పేర్కొంది. గంగ‌తోపాటు దాని ఉప‌న‌ది య‌మున‌కు కూడా ఈ హోదా ల‌భించింది. ఈ హోదా వ‌ల్ల న‌మామి గంగా పేరుతో జ‌రుగుతున్న గంగా ప్ర‌క్షాళ‌న ప్రాజెక్ట్‌కు మ‌రింత ప్రాధాన్య‌త ద‌క్కింది. త‌మ తీర్పు సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నంలోని న్యాయ‌మూర్తులు రాజీవ్ శ‌ర్మ‌, అలోక్ సింగ్.. న్యూజిలాండ్‌లోని వాంగ‌నుయ్ న‌దికి ఇలాంటి హోదానే ల‌భించింద‌ని గుర్తుచేశారు. ఈ న‌ది బాగోగుల‌ను చూసుకోవ‌డానికి ముగ్గురిని ప్ర‌త్యేకంగా కోర్టు నియ‌మించింది.

న‌మామి గంగా ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌, ఉత్త‌రాఖండ్ చీఫ్ సెక్ర‌ట‌రీ, అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌ ల‌కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. గంగ‌తోపాటు దాని ఉప‌న‌దుల ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను వీళ్లు చూసుకోవాల్సి ఉంటుంది. గంగా తీరంలో అక్ర‌మంగా సాగుతున్న మైనింగ్‌ను అరిక‌ట్టాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచారించిన హైకోర్టు.. ఈ తీర్పు వెలువ‌రించింది. శ‌తాబ్దాలుగా గంగా భార‌త జీవ‌న గ‌మ‌నంలో భాగంగా ఉంది. ఇక్క‌డి ఎన్నో జాతుల సంస్కృతీ సాంప్ర‌దాయాలు గంగ‌తో ముడిప‌డి ఉన్నాయి. అయితే గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇది ప్ర‌పంచంలోని అత్యంత క‌లుషితమైన న‌దుల్లో ఒక‌టిగా నిలుస్తున్న‌ది. గంగను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఎన్నో ఉద్య‌మాలు న‌డిచాయి. కోర్టులు కూడా ఎన్నో ఆదేశాలు జారీ చేశాయి. గంగ తీరంలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేయాల‌న్న డిమాండ్లు ఉన్నా అవి నెర‌వేర‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/