Begin typing your search above and press return to search.

111 సీట్లు కాదు 11 కూడా గెల‌వ‌లేవు కేసీఆర్‌

By:  Tupaki Desk   |   28 May 2017 4:25 AM GMT
111 సీట్లు కాదు 11 కూడా గెల‌వ‌లేవు కేసీఆర్‌
X
వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 111 సీట్లు వస్తాయని తెలంగాణ సీఎం - టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ త‌న పార్టీ నేత‌ల‌కు చెప్పిన జోస్యంపై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. కేసీఆర్ చెపుతున్న సర్వే అంత బోగస్ అని, గోబెల్స్ ప్రచారమ‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. 111 కాదు 11 అసెంబ్లీ సీట్లు గెలుచుకోలేర‌ని ఎద్దేవా చేశారు. ఏం ఘనకార్యాలు చేశారని ప్రజలు టీఆర్ ఎస్‌ కు ఓట్లు వేస్తారని ప్ర‌శ్నించారు.

టీఆర్ ఎస్‌ కు ఎందుకు ఓట్లు వేయాల‌ని ప్ర‌శ్నించిన ఉత్త‌మ్ కుమార్ ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల్లో సూటిగా నిల‌దీశారు. ``దేశంలోనే అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 1 గా ఉన్నందుకా.. మూడేళ్ల టీఆర్ ఎస్‌ పాలనలో 3000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా?మద్దతు ధరలు కావాలని అడిగిన పాపానికి కేసులు పెట్టి జైళ్లలో పెట్టి...బేడీలు వేసి హింసించినందుకా ? ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వనందుకా? అక్రమంగా భూ సేకరణ చేసి రైతులను లాఠీ ఛార్జ్ లు చేసి కుళ్ళ పొడిచినందుకా? ధర్నా చౌకను తరలించవద్దని అడిగిన పాపానికి విపక్షాల నేతలను కొట్టినందుకా ? ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ప్రసంగం కూడా చేయకుండా పారిపోయినందుకా?టీఆర్ఎస్ నేత‌ల్లో గల్లీ నాయకుల నుంచి సీఎం దాకా అడ్డగోలు అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నందుకా?``అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ,స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా వారిని చదువుకు దూరం చేసిన ఘ‌న‌త కేసీఆర్ స‌ర్కారుద‌ని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. ``మీకు ఎందుకు ఓటు వేయాలి? ద‌ళితులపై....గిరిజనులపై బీసీలపైనా దాడులు చేస్తున్నందుకా? ముస్లింలకు.. గిరిజనులకు రిజర్వేషను ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నందుకా? దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసినందుకా ? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెప్పి..కట్టకుండా దగా చేసినందుకా ?కేజీ టు పీజీ పథకం అమలు చేయకుండా మీన మేశాలు లెక్కపెడుతూ మోసం చేసినందుకా? విభజన చట్టం లో మనకు హక్కుగా రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారం ఇనుము ఫ్యాక్టరీ. ట్రైబల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, జాతీయ సాగునీటి ప్రాజెక్ట్,హైకోర్ట్.. లాంటివి తీసుకురాలే ఉన్నందుకు ప్రజలు ఓట్లు వేస్తారో కేసీఆర్ చెప్పాలి`` అని నిల‌దీశారు.

ఈ సర్వే కేసీఆర్ వాస్తవమని భావిస్తే టీఆర్ ఎస్‌ కు రాజకీయ ఫిరాయిoపులు చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు పెట్టించాల‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా ఉప ఎన్నిక‌లు వ‌స్తే ఎవరు విజయం సాధిస్తారో అప్పుడు తేలుతుందని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/