Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రిని ఆడుకున్న నెటిజ‌న్లు

By:  Tupaki Desk   |   23 May 2018 3:29 PM GMT
కేంద్ర మంత్రిని ఆడుకున్న నెటిజ‌న్లు
X
పెద్ద వాళ్లు సున్నిత‌మైన అంశాల్లో ఎలా ఉండాలో తెలియ‌జెప్పే ఉదాహ‌ర‌ణ ఇది. మ‌హిళ‌ల సంక్షేమం కోసం ప‌లు కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని చెప్పుకోవ‌డం, అందుకు త‌గినట్లుగా కొన్ని కార్య‌క్ర‌మాలు చేయ‌డం వ‌ర‌కు స‌రేకానీ అందులో చిత్త‌శుద్ధి, పైగా ప్ర‌చారంలోవాస్త‌విక‌త ఉండాల్సిందే. తాజాగా కేంద్ర‌మంత్రి ఒక‌రు చిత్త‌శుద్ధితో ప‌నిచేసిన‌ప్ప‌టికీ...ప్ర‌చారం చేసుకోవ‌డంలో కాస్త తేడా జ‌రిగింది. దీంతో మ‌హిళ‌ల విష‌యంలో మంత్రిగారు న‌వ్వుల పాల‌య్యారు.

కేంద్ర‌మంత్రి రవిశంక‌ర్ ప్ర‌సాద్ రెండ్రోజుల కింద‌ట ఉత్తరప్రదేశ్‌లోని గౌతంబుద్ధనగర్‌ జిల్లా ధనౌరికలాన్‌ గ్రామానికి వెళ్లి అక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఐటీ శాఖ మంత్రి అయిన ర‌విశంక‌ర్ త‌న శాఖ‌కు సంబంధించిన డిజిగావ్‌ పథకంలో భాగంగా అక్కడ వైఫై సేవలను ప్రారంభించారు. దీంతో పాటుగా అక్కడి మహిళల ఆధ్వర్యంలో నడుస్తోన్న శానిటరీ ప్యాడ్స్‌ తయారీ కేంద్రాన్ని కూడా ఇదే స‌మ‌యంలో ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ సందర్శించారు. స‌హ‌జంగానే బీజేపీ నేత‌లు ఎంత ప‌నిచేస్తే అంత ప్ర‌చారం కోరుకుంటారు క‌దా! ర‌విశంక‌ర్ ప్రసాద్ సైతం శానిట‌రీ ప్యాడ్స్ త‌యారీ కేంద్రాన్ని సంద‌ర్శించి కొన్ని ఫొటోల‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ‘‘ఈ మహిళలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. శానిటరీ ప్యాడ్ల తయారీతో వీరికి జీవనోపాధి లభించడమేకాదు, స్త్రీస్వాభిమానాన్ని కూడా నిలబెడుతున్నారు’’ అని ట్వీట్ చేశారు.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కానీ మంత్రి గారి ఫొటోలోని వింత‌ను నెటిజ‌న్లు ప‌ట్టుకున్నారు. అదేంటంటే..ఆ ఫొటోలో ఒక్కరు కూడా మ‌హిళ‌లు లేరు. మ‌హిళామ‌ణులు మ‌చ్చుకైనా క‌నిపించిన నేప‌థ్యంలో నెటిజ‌న్లు మంత్రిపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ‘ఫొటోలో ఏదో తేడా ఉందే!’ అంటూ ప‌రోక్షంగా సెటైర్లు వేస్తే...`ఇదేంటి స‌ర్‌...మహిళల కష్టాన్ని మగవాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారా?’, ‘శానిటరీ ప్యాడ్లు మగవారికా, ఆడవారికా?’, అంటూ ఇంకొంద‌రు డైరెక్టుగానే పంచ్‌లు వేశారు. ఇలా నెటిజ‌న్లు విరుచుకుప‌డిన తీరు ఆల‌స్యంగా మంత్రి దృష్టికి చేర‌డంతో... స‌ర్దుకున్న ర‌విశంక‌ర్ ఆ కార్య‌క్ర‌మంలో మహిళలతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్లు ఆయ‌నపై దాడి చేయ‌డంలో శాంతించారు.