Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు ఉండ‌వ‌ల్లి జై కొడ‌తారా?

By:  Tupaki Desk   |   29 Aug 2016 1:22 PM GMT
జ‌గ‌న్‌ కు ఉండ‌వ‌ల్లి జై కొడ‌తారా?
X
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - రాజ‌మండ్రి ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి పాజిటివ్‌ గా ఆయ‌న చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో పొలిటిక‌ల్ గా సెంట‌ర్ ఆఫ్ ది టాపిక్ అయ్యాయి. వాస్త‌వానికి ఆయ‌న క‌ర‌డుగ‌ట్టిన కాంగ్రెస్ వాది. వైఎస్ హ‌యాంలో ఉండ‌వ‌ల్లి ఆడింది ఆట పాడింది పాట‌. ఈ నేప‌థ్యంలోనే ఈనాడు అధినేత రామోజీపై ప‌లు కేసులు కూడా దాఖ‌లు చేశారు. అయితే, వైఎస్ మ‌ర‌ణంతో ఒకింత వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, ఇప్పుడు రాజ‌కీయంగా చూసుకుంటే ఏపీలో ఆయ‌న కాంగ్రెస్‌ లోనే కొన‌సాగుతున్నా.. మ‌న‌సు మాత్రం అక్క‌డ లేన‌ట్టే ఉంది.

ఎందుకంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్ప‌ట్లో పుంజుకునే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డం, త్వ‌ర‌లోనే 2019 ఎన్నిక‌ల‌కు అన్ని పార్టీలూ సిద్ధం చేస్తుండ‌డం వంటి ప‌రిణామాలు ఆయ‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌నీయ‌డం లేదు. దీంతో ఉండ‌వ‌ల్లి రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం మ‌రో పార్టీ లోకి జంప్ చేయ‌క‌ త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి రాజ‌కీయ మేథావి అయిన ఉండ‌వ‌ల్లి జ‌గ‌న్ పార్టీ పుంజుకుంటుంద‌ని భావిస్తున్నారో ఏమో దానికి మ‌ద్ద‌తుగా ఇటీవ‌ల కొన్ని కామెంట్లు చేశారు. ఆయా వ్యాఖ్య‌ల‌ను... ఉండ‌వ‌ల్లి ప్రెస్ మీట్‌ ను మీడియా .. విస్తృతంగా ప్ర‌సారం చేసింది. ప‌దే ప‌దే కూడా టెలీకాస్ట్ చేసింది. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే.. రాజశేఖర్‌ రెడ్డి కొడుకు జగన్‌ పై తమకు అభిమానం ఉండటం సహజమేనని, మా కళ్ల ముందు తిరిగిన కుర్రాడు, జ‌గ‌న్‌ సీఎం అవుతాడంటే ఆనందిస్తామని వ్యాఖ్యానించడం గమనార్హం.

అదేస‌మ‌యంలో సీఎం చంద్రబాబుతో తమకెప్పుడూ స్నేహ సంబంధాలు లేవని, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్ద పరిచయం లేదన్నారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్‌ గా పెద్ద‌ చ‌ర్చ‌కు దారితీశాయి. మ‌రోప‌క్క‌, గ‌తంలో జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌ లో ఉతికి ఆరేసిన ఉండ‌వ‌ల్లి.. ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకోవ‌డంపైనా విశ్లేష‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. ఉండ‌వ‌ల్లి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ పంచ‌న చేరిపోయ‌వ‌డం ఖాయమ‌ని అంటున్నారు.

మ‌రోప‌క్క‌, జ‌గ‌న్‌ కు కూడా ఉండ‌వ‌ల్లి వంటి ఉద్ధండుల అవ‌స‌రం ఎంతో ఉంద‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో అధికారం చేజిక్కించుకునేందుకు జ‌గ‌న్ ఉత్సాహంగా ఉన్నార‌ని ఆయ‌న కేడ‌ర్ అంటోంది. ఇక‌, ఇటీవ‌లి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒక‌రు ఇటీవ‌ల జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేశారు. దీంతో జ‌గ‌న్ కోట‌రీలో ఆశ‌లు చిగురిస్తున్నాయి. త‌మ పార్టీ పుంజుకుంటుంద‌ని, 2019 నాటికి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మేన‌ని జ‌గ‌న్ అనుచ‌రులు సంబ‌రప‌డిపోతున్నార‌ట‌. ఇక ఉండ‌వ‌ల్లి వైకాపాలోకి వ‌స్తే ఆయ‌న‌కు 2019 ఎన్నిక‌ల్లో రాజమండ్రి లోక్‌స‌భ టిక్కెట్టును జ‌గ‌న్ ఆఫ‌ర్ చేస్తార‌ని కూడా స‌మాచారం.