Begin typing your search above and press return to search.

కమలంలో కీచులాటలపైనే ఉండవిల్లి ఫోకస్ !

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:05 PM GMT
కమలంలో కీచులాటలపైనే ఉండవిల్లి ఫోకస్ !
X
అవిశ్వాసం పెడితే ఏం జరుగుతుంది? ఎటూ ప్రభుత్వం పడిపోదు కదా..? తిరుగులేని మెజారిటీ ఉన్న మోడీ సర్కారు అవిశ్వాస తీర్మానానికి ఎందుకు జడుస్తుంది? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. రాజమండ్రి మాజీ ఎంపీ, పవన్ కమిటీలో కీలక వ్యక్తిగా వ్యూహరచనలో ఉన్న ఉండవిల్లి అరుణ్ కుమార్ మాత్రం అవిశ్వాసం ఎలా పరిణమించే అవకాశం ఉన్నదో తన అంచనాలను వెల్లడించారు.

ఆంద్రవాళ్లు ఏమీ చేతకానివాళ్లు.. ఏం చేసినా సరే.. పడి ఉంటారు అనే ఉద్దేశంతో ఆరోజు తీసి పక్కన పడేశారని.. ఇవాళ అవిశ్వాసం వల్ల.. ఆంధ్రావాళ్లతో పెట్టుకుంటే.. అందరినీ కలుపుకుని ఏకంగా ప్రభుత్వాలను సైతం కూల్చేయగలరని ఆయన అంటున్నారు. అవిశ్వాసానికి భాజపా వ్యతిరేకత ఉన్న అనేక పార్టీలు మద్దతు ఇస్తాయని చెబుతున్నారు.

అప్పట్లోనే కాంగ్రెస్ ప్రతిపాదించిన రాష్ట్ర విభజనను తృణమూల్ కాంగ్రెస్ - సీపీఎం పార్టీలు వారికి రాష్ట్రంతో సంబంధం లేకపోయినా వ్యతిరేకించాయని, వారిద్దరూ బద్ధ వ్యతిరేకులైనా.. ఏపీకోసం లేచి నిలబడ్డారని చెప్పారు. అలాంటి వారితో పాటు - కాంగ్రెస్ యూపీఏ పక్షాలు.. శివసేన చివరికి తెరాస లేచి అవిశ్వాసానికి మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదని ఉండవిల్లి అంటున్నారు.

వీటన్నింటినీ మించి.. భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు పుష్కలంగా ఉన్నాయని.. ఈ అవిశ్వాసం సందర్భంగా అవి బట్టబయలు అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. భారతీయ జనతా పార్టీలోని అంతర్గత విభేదాలు పనిచేస్తే చాలు ప్రభుత్వం దానంతట అదే కూలిపోయినా ఆశ్చర్యం లేదని ఉండవిల్లి అంటున్నారు.

అయితే ఉండవిల్లి మాటలను సహించలేకపోతున్న కమలదళాలు మాత్రం.. ఆయన తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుంతుండడం విశేషం. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఉండవిల్లి ఇంకా మోసం చేస్తున్నారని.. భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఉండవిల్లి మోసపూరితమైన ఉచ్చులో పవన్ కల్యాణ్ చిక్కుకోవడం బాధాకరం అంటూ ఆకుల - జనసేన అధినేత మీద సానుభూతి వ్యక్తం చేయడం గమనార్హం.