Begin typing your search above and press return to search.

కోహ్లి వెర్సస్ కుంబ్లే.. ఒక షాకింగ్ విషయం

By:  Tupaki Desk   |   22 Jun 2017 10:19 AM GMT
కోహ్లి వెర్సస్ కుంబ్లే.. ఒక షాకింగ్ విషయం
X
టీమ్ ఇండియా కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకునన్న నేపథ్యంలో కోహ్లితో అతడి విభేదాల గురించి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. వీళ్లిద్దరికీ సయోధ్య కుదిర్చే క్రమంలో బీసీసీఐ అధికారులకు తెలిసిన విషయాలు చూసి షాకవుతున్నారు. కెప్టెన్.. కోచ్ మధ్య ఆరు నెలలుగా అసలు మాటలే లేవన్న సమాచారం బయటికి వచ్చింది. మరి మాటలే లేకుండా ఇన్నాళ్లు వీళ్లిద్దరూ ఎలా నెట్టుకొచ్చారన్నది అర్థం కాని విషయం. గత ఏడాది చివర్లో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా కుంబ్లే.. కోహ్లి మధ్య తొలిసారి విభేదాలు మొదలయ్యాయట. ఇక అప్పట్నుంచి ఇద్దరి మధ్య సయోధ్యే కుదరలేదట. జట్టులోని మిగతా సభ్యులతోనూ కుంబ్లేకు విభేదాలు తలెత్తాయట.

టీమ్ ప్రాక్టీస్ సమయంలో కుంబ్లేకు కోహ్లికి మధ్య కమ్యూనికేషనే ఉండేది కాదట. సహాయ కోచ్ బంగరే ప్రాక్టీస్ వ్యవహారాల్ని పర్యవేక్షించేవాడట. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కూడా కోహ్లికి.. కుంబ్లేకు అస్సలు మాటలే లేవని బోర్డు అధికారులకు ఇటీవలే తెలిసింది. కుంబ్లే.. కోహ్లి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సచిన్.. గంగూలీ.. లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ లండన్లో సమావేశం నిర్వహించిన సమయంలో విభేదాలు ఎంత తీవ్ర స్థాయికి చేరాయో వెల్లడైంది. అప్పుడు.. కోహ్లితో వేరుగా.. కుంబ్లేతో వేరుగా.. తర్వాత ఇద్దరితో కలిపి సమావేశాలు నిర్వహించారు సచిన్.. గంగూలీ..లక్ష్మణ్. ఈ సందర్భంగా కుంబ్లే తనకు కోహ్లితో విభేదాలేమీ లేవని చెప్పగా.. కోహ్లిమాత్రం కుంబ్లేతో కష్టమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇద్దరితో కలిపి సమావేశం నిర్వహించినపుడు ముభావంగా ఉన్నారని.. ఇద్దరి మధ్య కమ్యూనికేషనే కనిపించలేదని.. ఇద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో ఇక ఇద్దరికీ సయోధ్య కుదర్చడం సాధ్యం కాదని తేలిపోవడంతో కుంబ్లే తప్పుకోక తప్పలేదు. కుంబ్లే తన వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నాడని.. అనుష్కతో రిలేషన్ షిప్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కోహ్లికి మండినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కుంబ్లేను కోహ్లి దూషించినట్లు.. జట్టు సభ్యులెవరికీ నువ్వు కోచ్ గా కొనసాగడం ఇష్టం లేదన్న సంకేతాలిచ్చాడని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/