Begin typing your search above and press return to search.

టీడీపీ అవిశ్వాసానికి ఆదిలోనే హంసపాదు

By:  Tupaki Desk   |   16 July 2018 6:06 AM GMT
టీడీపీ అవిశ్వాసానికి ఆదిలోనే హంసపాదు
X
కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తాం.. అన్ని పార్టీల మద్దతు కూడగడతామంటూ దేశంలోని అన్ని పార్టీల నేతలను కలిసేందుకు బయలుదేరిన టీడీపీ నేతలకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. ఈ విషయంలో తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ ఎంపీలకు శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కానీ - ఆయన పార్టీ నేతలు కానీ అపాయింటుమెంటు ఇవ్వకుండా తిప్పి పంపించారట. ఈ విషయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది.

బీజేపీతో కొద్దికాలం కిందట విభేధించి ప్రస్తుతం దోబూచులాడుతున్న శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే గతంలో మమత బెనర్జీ - హార్దిక్ పటేల్ వంటివారిని కలిసిన సంగతి తెలిసిందే.. కానీ, అదే బీజేపీతో విభేదిస్తున్న తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం శివసేన స్టాండ్ వేరేలా ఉంది. రెండు రోజుల్లో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకుగాను అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే బీజేపీతో గిట్టని శివసేన అధినేతను కలిసేందుకు ఆదివారం టీడీపీ ఎంపీల బృందాన్ని ముంబయి పంపించారు చంద్రబాబు.. కానీ, అక్కడ వారికి చుక్కెదురైంది. ఉద్దవ్ కాదు కదా ఆ పార్టీ నేతలెవరూ వారికి కనీసం అపాయింటుమెంటు ఇవ్వలేదట.

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ - శివసేనే నేత ఆనందరావు అడ్సల్ తమ ఎంపీలను ఉద్దవ్ తో సమావేశానికి సమయం ఖరారు చేశారని.. ఆదివారం సాయత్రం 5.30 ఈ భేటీ ఉంటుందని తొలుత టీడీపీ తెలిపింది. అందుకుగాను టీడీపీ ఎంపీలు తోట నర్సింహ - పండుల రవీంద్రబాబు ముంబయి వెళ్లారు. కానీ.. ఉద్దవ్ వారికి అపాయింటుమెంటు ఇచ్చేందుకు నిరాకరించారని శివసేన వర్గాలు చెప్పాయి.

ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై ఉద్దవ్ ఆగ్రహంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని సమాచారం. టీడీపీ ఎన్డీయేలో ఉన్న సమయంలో శివసేనకు బీజేపీతో విభేదాలు ఏర్పడినప్పుడు తమ పక్షం వహించడానికి చంద్రబాబు నిరాకరించారని ఉద్దవ్ ఆగ్రహంగా ఉన్నారట. అలాగే టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ శివసేన ఎంపీని నో ఫ్లై లిస్టులో పెట్టడమూ ఆయనకు కోపం తెప్పించిందట. అందుకే .. ఇప్పుడు టీడీపీ ఎంపీలకు కనీసం అపాయింటుమెంటు ఇవ్వలేదని టాక్.

మరోవైపు శివసేన - బీజేపీలు మళ్లీ దగ్గరవుతుండడం కూడా ఇందకు కారణమని తెలుస్తోంది. రెండు రోజుల కింద ఉద్ధవ్ పుణెలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ - శివసేన కలిసి పోటీ చేస్తాయని నర్మగర్భంగా చెప్పారు కూడా. ఇవన్నీ ఎలా ఉన్నీ టీడీపీ అవిశ్వాస యత్నాలుకు ఆదిలోనే అపశకునం ఎదురవడం మాత్రం బీజేపీకి ఉత్సాహం తెప్పించే అంశమే.