Begin typing your search above and press return to search.

ఇవాంకా టీం ష‌రతుల‌తో పోలీసుల షాక్‌

By:  Tupaki Desk   |   19 Nov 2017 7:48 AM GMT
ఇవాంకా టీం ష‌రతుల‌తో పోలీసుల షాక్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ఇటు తెలంగాణ సర్కారుకు ముఖ్యంగా పోలీసుల‌కు స‌వాలుగా మారాయి. ఈ నెల 28వ తేదీ నుంచి హెచ్‌ఐసిసిలో జరగనున్న గ్లోబల్ ఎంటర్ పెన్యూర్ సమ్మిట్ (జిఇఎస్) సదస్సుకు బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తదితరులు హాజరవుతున్న ఈ సదస్సును భద్రతా దళాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇవాంక బందోబస్తు కోసం నెల రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్న అమెరికా సెక్యూరిటీ సర్వీసెస్ అధికారులు - ఎస్‌ పిజి అధికారులు - రాష్ట్ర పోలీసు అధికారులు తరచూ సమావేశమై భద్రతపై ఒకటి రెండు పర్యాయాలు సమీక్షించుకుంటున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా విధించే ష‌ర‌తులు అధికారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయ‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే ఇవాంక పాల్గొంటున్న కార్యక్రమాలలో భద్రతా సిబ్బంది ఎవరూ ఆయుధాలతో ఉండొద్దని ఆంక్షలు విధించిన యుఎస్ భద్రతాధికారులు తాజాగా పోలీసు యూనిఫాంపై కూడా ఆంక్షలు విధించారు. వేదిక బయట బందోబస్తు నిర్వహించే వారు మినహా - వేదికపైనా - సమీపంలో భద్రతను నిర్వహించే రాష్ట్ర పోలీసులెవరూ యూనిఫాంలో ఉండొద్దని సూచించారు. వేదికపై ఉండే ఒకే ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రమే యూనిఫాంలో ఉండాలని, మిగతా భద్రతా సిబ్బంది అందరూ సివిల్ దుస్తుల్లోనే విధులను నిర్వహించాలని యుఎస్ భద్రతాధికారులు రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. దీంతో అవాక్క‌వ‌డం మ‌న పోలీసుల వంతు అయింది. భద్రత కోసం అమెరికా నుంచి తెచ్చుకునే ఆయుధాలకు అనుమతి కోరుతూ యుఎస్ భద్రతాధికారులు మన కస్టమ్స్ అధికారులకు లేఖ రాశారు.

మరోవైపు జీఈఎస్ సదస్సు బందోబస్తుకు యుఎస్ సెక్యూరిటీ సర్విసెస్ అధికారులతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌ పిజి) - ఆక్టోపస్ కమాండోస్ - గ్రేహాండ్స్ సిబ్బంది సంయుక్తంగా నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో తరచూ ప్రయాణిస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో స్నిపర్ టీంలను కూడా నియమించాలని నిర్ణయించారు. సదస్సు మొదటి రోజు ఇవాంక, ప్రధాన మంత్రి మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే ఫలక్‌ నుమా ప్యాలేస్ చుట్టూ దాదాపు అయిదు వేల సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పాతబస్తీలో మొత్తం 40 వేల సిసి కెమెరాలను అమర్చుతున్నారు. ఇక్కడ సుమారు 3500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా అతిథులు బస చేసే హోటళ్ళ వద్ద బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. ఇవాంకాతో పాటు అమెరికా నుంచి దాదాపు 500 మంది అతిథులు వస్తారని అధికారులు అంచనా వేశారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల వచ్చే దాదాపు 400 మంది ప్రతినిధులు పార్క్ హయాత్ - గ్రాండ్ కాకతీయ - తాజ్‌ కృష్ణ - తాజ్‌ దక్కన్ - నోవాటెల్ - తదితర హోటళ్ళలో బస చేస్తారు. విమానాశ్రయ సిబ్బంది - ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీలతోను భద్రతాధికారులు తరచూ సమావేశమవుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ నుంచి మాదాపూర్ వరకు - అక్కడి నుంచి ఫలక్‌ నుమా ప్యాలేస్ వరకు కాన్వాయ్ రిహార్స‌ల్‌ ను కూడా నిర్వహించారు. ఇవాంకా - మోడీ రాకపోకలు సాగించే మార్గంలో 20కి పైగా సమస్యాత్మక ప్రాంతాలని అధికారులు గుర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇవాంకా 37 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తారు.