Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ కు గూబ గుయ్ మనిపించిన బ్రిటన్

By:  Tupaki Desk   |   25 March 2017 11:14 AM GMT
పాకిస్థాన్ కు గూబ గుయ్ మనిపించిన బ్రిటన్
X
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిత్-బాల్టిస్తాన్ కు రాష్ర్ట హోదా ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పాకిస్థాన్ కు బ్రిటన్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ ప్రదేశమంతా భారత్ అంతర్భాగమని తేల్చిచెప్పింది. అది కూడా అక్కడి పార్లమెంటు సాక్షిగా తెలిపింది. పాక్ లోని గదర్ రేవును నిర్మిస్తున్న చైనా తన దేశం నుంచి గదర్ వరకు గిల్గిత్ మీదుగా ఎకనమిక్ కారిడార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వివాదాస్పద ప్రాంతం నుంచి కారిడార్ నిర్మిస్తే వివాదం తలెత్తుతుందన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని పాక్ లోని రాష్ట్రంగా ప్రకటింపజేయడానికి రెడీ అయింది. చైనా ఒత్తిడితో పాక్ ఈ దిశగా ప్రకటన చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ పరిణామాలను గమనించిన బ్రిటన్ దానికి ఆదిలోనే అడ్డుకట్టవేసింది.

గిల్గిత్-బాల్టిస్థాన్ ను ఐదో రాష్ట్రంగా పాకిస్థాన్ ప్రకటించడాన్ని బ్రిటన్ పార్లమెంటు తప్పబట్టింది. చట్టబద్ధంగా ఈ భూభాగం భారతదేశంలోని జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోనిదని తేల్చి చెప్పింది. 1947లో చట్ట విరుద్ధంగా, అక్రమంగా ఈ భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుందని తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఈ నెల 23న కన్సర్వేటివ్ నేత బాబ్ బ్లాక్ మన్ ప్రతిపాదించారు. వివాదాస్పదమైన ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకునే విధంగా పాక్ ప్రకటన ఉందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రాథమిక హక్కులు తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపింది. కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా అక్కడి పౌరులకు లేదని చెప్పింది. ఇదే సమయంలో చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ను కూడా తప్పుబట్టింది. ఈ కారిడార్ నిర్మాణం చాలా తీవ్రమైన విషయమని... వివాదాస్పద ప్రాంతంలో జోక్యం చేసుకోవడమేనని ఖరాకండీగా తేల్చేసింది. బ్రిటన్ ఈ విషయంలో తన వైఖరి స్పష్టం చేయడంతో మిగతా దేశాలు కూడా దీనిపై స్పందిస్తాయని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/