Begin typing your search above and press return to search.

సంపన్నకుటుంబీకులే మానవబాంబులు

By:  Tupaki Desk   |   25 April 2019 6:44 AM GMT
సంపన్నకుటుంబీకులే మానవబాంబులు
X
సాధారణంగా ఉగ్రవాద మూకలు పేదరికంతో బాధపడుతున్న యువతకు డబ్బు ఆశచూపి వారికి మతజాఢ్యాన్ని జోడించి తీవ్రవాదం వైపు అడుగులు వేయిస్తుంటారు. ఇలా పాకిస్తాన్, సహా సిరియా, ఇరాక్ దేశాల్లో చాలా మంది మానవబాంబులా మారి విధ్వంసాలు సృష్టిస్తున్నారు.

అయితే తాజాగా శ్రీలంకలో జరిగిన బాంబు దాడుల్లో పాల్గొన్నది ఎవరో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగకమానదు. శ్రీలంకలో వందలాది మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు శ్రీలంకలోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన వారు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోటీశ్వరులైన వీరు మానవబాంబులుగా ఎందుకు మారారు? ఎందుకు చంపారన్నది తెలిసి వారి సన్నిహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

శ్రీలంకలో పేలుళ్ల చేసిన ఇద్దరు ఉగ్రవాదుల్లో సంపన్న కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఉండడం విశేషం. మానవబాంబులుగా మారిన ఇల్హాం ఇబ్రహం, ఇన్ఫాఫ్ ఇబ్రహంలు శ్రీలంకలో పేరుమోసిన సుగంధ ద్రవ్యాల వ్యాపారుడి కుమారులు. వీరిద్దరూ కూడా వ్యాపారాలు చేస్తున్నవారే.. 33 ఏళ్ల ఇన్ఫాఫ్ ఇబ్రహం ఒక కాపర్ ఫ్యాక్టరీ యజమాని కావడం విశేషం. ఇక మరో సోదరుడు ఇల్హామ్ ఇబ్రహం పేరు మోసిన నగల వ్యాపారి కూతురును పెళ్లాడి బడా బాబుగా ఉన్నారు.

మానవబాంబులుగా మారిన ఈ ఇద్దరు సోదరులకు మంచి పేరుంది. వీరు చాలా మంచివారని.. ఫ్యాక్టరీలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆదుకుంటారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. సంపన్న కుటుంబం కావడంతో చాలా మందికి ఆర్థిక సాయం చేశారని వివరించారు. వీరు ఎందుకు మానవబాంబులుగా మారారో అర్థం కావడం లేదంటున్నారు. వీరి చర్య చూశాక ఒక సామాజికవర్గం వారిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేర్కొన్నారు.

అయితే ఈ ఇద్దరు సోదరులు స్థానిక టెర్రరిస్ట్ గ్రూప్ ఎన్ టీజే సానుభూతిపరులుగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.. వీరు టెర్రరిస్టు సిద్ధాంతాలను బహిరంగంగా చెప్పేవారని.. కానీ ఇలా మానవబాంబులుగా మారుతారని ఊహించలేదన్నారు. ఎంతో మందికి సాయం చేసిన వీరు ఇలా మనుషుల ప్రాణాలు తీస్తారని ఊహించలేదంటున్నారు. ఇన్హాఫ్ ఇబ్రహం విలాసవంతమైన షాంగ్రి లా హోటల్ లో తనను తాను పేల్చుకోగా.. మరోసోదరుడు ఇల్హాం చర్చిలో మానవబాంబుగా మారి పేల్చుకున్నాడు.