Begin typing your search above and press return to search.

ఒకేరోజు ఇద్ద‌రు విద్యార్థినుల సూసైడ్‌

By:  Tupaki Desk   |   12 Oct 2017 10:34 AM GMT
ఒకేరోజు ఇద్ద‌రు విద్యార్థినుల సూసైడ్‌
X

ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన ఇద్ద‌రు హైద‌రాబాద్ విద్యార్థినులు సూసైడ్ చేసుకున్నారు. ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ అమ్మాయిలు వివిధ కార‌ణాలతో చ‌నిపోవ‌ట‌మో.. సూసైడ్ చేసుకోవ‌టం జ‌రుగుతోంది. ఒకే రోజు.. ఇంచు మించు ఒకే స‌మ‌యంలో (కొన్ని గంట‌ల తేడాతో) ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఒక‌రు బీటెక్ ఆఖ‌రు సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని కాగా మ‌రొక‌రు ఎంసెట్ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని కావ‌టం గ‌మ‌నార్హం.

సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టి మ‌రీ.. హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ కాలేజీల్లో ఒక‌టైన మ‌ల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న మౌనిక ఈ రోజు ఉరి వేసుకొని చ‌నిపోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకున్న ఆమె వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

దుండిగ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సూరారం కాల‌నీలో చోటు చేసుకున్న ఈ దారుణంలో మ‌రో విష‌యం ఏమిటంటే.. తాను ఆత్మ‌హ‌త్య చేసుకోనున్న విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో చెప్పి మ‌రీ త‌నువు చాలించ‌టం. త‌న‌ను అంద‌రూ అవ‌మానిస్తున్నార‌ని.. తాను సంతోషంగా ఉండ‌టాన్ని ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని పేర్కొంది. సంతోషంగా ఉండగ‌ల‌నా? అన్న సందేహం త‌న‌కు క‌లుగుతుంద‌ని పేర్కొన్న మౌనిక‌.. తాను ఆత్మ‌హ‌త్య చేసుకోనున్న విష‌యాన్ని త‌న పోస్ట్ తో చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఇంట్లో ఉరి వేసుకున్న మౌనిక‌ను గుర్తించిన కుటుంబ స‌భ్యులు ఆమెను హుటాహుటిన నారాయ‌ణ హృద‌యాల‌య ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లుగా డాక్ట‌ర్లు ధ్రువీక‌రించారు. కేసును న‌మోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ క‌ల‌హాలు.. త‌ల్లి మంద‌లించింద‌న్న ఉద్దేశంతోనే మౌనిక సూసైడ్ చేసుకుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఒత్తిడితో..? మాదాపూర్ లోని శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్న లాంగ్ ట‌ర్మ్ విద్యార్థిని సంయుక్త సూసైడ్ చేసుకుంది. బుధ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత చున్నీతో ఉరి వేసుకుంది. ఆ విష‌యాన్ని గుర్తించిన వారు.. సంయుక్త త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారాన్ని అందించారు. సంయుక్త త‌ల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా బోధ‌న్ మండ‌లంలోని రాంప‌ల్లి గ్రామానికి చెందిన రాజేంద‌ర్ కుమార్తెగా గుర్తించారు. తాను ఒత్తిడి కార‌ణంగానే చ‌నిపోతున్న‌ట్లుగా సూసైడ్ లెట‌ర్స్ రాసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. దీంతో క్యాంప‌స్ లోని వారంతా విషాదంలో మునిగిపోయారు. చురుగ్గా.. అంద‌రితో క‌లివిడిగా ఉండే సంయుక్త కొద్దిరోజులుగా ఒంట‌రిగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.