Begin typing your search above and press return to search.

క‌మిష‌న‌ర్‌ ను కుమ్మేసిన టీఆర్ ఎస్ నేత‌లు

By:  Tupaki Desk   |   26 Sep 2017 7:49 AM GMT
క‌మిష‌న‌ర్‌ ను కుమ్మేసిన టీఆర్ ఎస్ నేత‌లు
X
ఏంటిది నిజ‌మే? తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో స‌ర్వ‌స్వం అన్న‌ట్లుగా బ‌య‌ట టాక్ ఉంటే.... టీఆర్ ఎస్ నాయ‌కులే ఆయ‌న మాట విన‌ట్లేద‌ని ఎలా చెప్తారు? అస‌లు అది జ‌రిగే ప‌నేనా? పైగా కేటీఆర్ చెప్తే విన‌కుండా క‌మిష‌న‌ర్‌ను కుమ్మేశార‌ని అందులోనూ టీఆర్ ఎస్ నాయ‌కుల‌ని పేర్కొన‌డం ఏంటి....అని కస్సుబుస్సుమ‌న‌కండి. జ‌రిగింది తెలుసుకుంటే అవును నిజ‌మే అని మీరు కూడా అంటారు.

ఒక్క‌సారి గ‌తంలో రాష్ట్ర పురపాల‌క మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పిన మాట‌లు గుర్తు చేసుకుందాం. న‌గ‌రాల‌ను - ప‌ట్ట‌ణాల‌ను ప‌ర్యావ‌ర‌ణహితంగా రూపొందించుకునేందుకు ఫ్లెక్సీల వాడ‌కాన్ని నిషేధించాల‌ని కేటీఆర్ కోరారు. త‌న బ‌ర్త్‌ డేకు కూడా పెట్ట‌వ‌ద్ద‌ని ఆదేశించారనేది తెలిసిందే క‌దా? క‌ట్ చేస్తే...ఇప్పుడు ఖ‌మ్మంలో జ‌రిగిన ర‌చ్చ - అది టీఆర్ ఎస్ వాళ్లు చేసింది చూస్తే షాక్ అవ‌డం ఖాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్‌ కమిషనర్‌పై టీఆర్‌ ఎస్‌ నాయకులు సోమవారం దాడిచేశారు. కమిషనర్‌ ఇంటికెళ్లి మరీ కొట్టారు.

కమిషనర్‌ రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం...గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులుగా ఇల్లందుకు చెందిన దిండిగాల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం సోమవారం కొత్తగూడెంలో నిర్వహించనున్నారు. అలాగే డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ ఎస్‌ నాయకులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాకు కూడా ఫ్లెక్సీలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని కమిషనర్‌ ను కొన్ని కార్మిక సంఘాల యూనియన్లు కోరాయి. ఫ్లెక్సీలు కట్టడానికి ఎవరికీ అనుమతి లేదు అంటూ నిరాకరించారు. ఫ్లెక్సీల ఏర్పాటు విషయం తన దృష్టికి రావటంతో...ఆదివారం రాత్రి సిబ్బందితో కలిసి తొలగించడానికి వెళ్లారు. దీనికి కొందరు టీఆర్‌ ఎస్‌ నాయకులు అడ్డుపడ్డారు. ప్లెక్సీలు కట్టడానికి అనుమతులు లేవని అందుకే తొలగిస్తున్నట్టు కమిషనర్‌ తెలిపారు. అంతే టీఆర్ ఎస్ నాయ‌కుల‌కు మండిపోయింది.క‌మిష‌న‌ర్‌ తో టీఆర్‌ ఎస్‌ శ్రేణులు ఘర్షణ పడ్డారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రాత్రి వివాదం సద్దుమనిగింది.

అయితే ఎపిసోడ్ ఇక్క‌డితోనే అయిపోలేదు....సోమవారం ఉదయం టీఆర్‌ ఎస్‌ పట్టణాధ్యక్షులు సిలివేరు సత్యనారాయణ - కౌన్సిలర్‌ జానిపాషా - ఎమ్మెల్యే అసిస్టెంట్‌ గణేష్‌ - మదారమ్మలు కమిషనర్‌ క్వార్టర్‌ కు వెళ్లారు. 'మా ప్లెక్సీలు తొలగిస్తావా. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తావా' అంటూ కౌన్సిలర్‌ జానిపాషా - ఎమ్మెల్యే అసిస్టెంట్‌ గణేష్‌ లు కమిషనర్‌ చెంప మీద కొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కడుపులో పిడి గుద్దులు గుద్దారు. చేతిలో ఉన్న సెల్‌ ఫోన్‌ ను సిలివేరు సత్యనారాయణ గుంజుకుని కింద పడేశారని కమిషనర్‌ తెలిపారు. కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబుకు కార్యాలయం సిబ్బంది బాసటగా నిలిచారు. నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్‌ చేసేవరకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్ళకుండా విధులు బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. జగదాంబ సెంటర్‌ లో పారిశుధ్య కార్మికులు రోడ్డుపై చెత్తవేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు మంచినీటి సరఫరా నిలిపేస్తామన్నారు.