Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ :రాజమండ్రి ఎంపీ త్రిముఖ పోరులో గెలుపెవరిదంటే....

By:  Tupaki Desk   |   22 March 2019 8:06 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్ :రాజమండ్రి ఎంపీ త్రిముఖ పోరులో గెలుపెవరిదంటే....
X
పార్లమెంట్ నియోజకవర్గం : రాజమండ్రి

టీడీపీ : మాగంటి రూప
వైసీపీ : మార్గాని భరత్
జనసేన : ఆకుల సత్యనారాయణ

రాజమండ్రి అంటే ఖరీదైన రాజకీయం.. ఆర్థికంగా చాలా బలమైన ప్రాంతం.. వాణిజ్య కేంద్రం కావడంతో ఈ సీటు కోసం బడాబడా బాబులు పోటీపడుతుంటారు. ఈసారి కూడా అంతే పోటీ నెలకొంది. కానీ అనూహ్యంగా కొత్త అభ్యర్థులు రాజమండ్రి బరిలో నిలిచారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప టీడీపీ అభ్యర్థిగా కొత్తగా తెరపైకి వచ్చింది. ఇక వైసీపీ అనూహ్యం రాజమండ్రిపై బీసీ కార్డును ప్రయోగించింది. సామాజిక ఎత్తుగడను వేసింది. మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఇక కాపు సామాజికవర్గాన్ని బేస్ చేసుకొని బలమైన ఆకుల సత్యనారాయణను జనసేన బరిలోకి దింపింది. ఈ ముక్కోణపు పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

*రాజమండ్రి చరిత్ర

2007లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యస్తీకరణలో ఈ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. పూర్వమున్న బూరుగుపూడి - కడియం - రామచంద్రాపురం ఆలమూరు శాసనసభా నియోజకవర్గాలు తొలిగిపోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చి చేరాయి. తూర్పు నుంచి 4 - పశ్చిమ గోదావరి నుంచి 3 అసెంబ్లీ స్థానాలతో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లతో రాజమండ్రి ఏర్పడింది. అనపర్తి - రాజానగరం - రాజమండ్రి సిటీ - రాజమండ్రి రూరల్ - కొవ్వూరు - నిడదవోలు - గోపాలపురం నియోజకవర్గాలతో రాజమండ్రి పార్లమెంట్ స్థానం ఉంది.

వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఆధిపత్యం రాజమండ్రిపై కొనసాగింది. 2004-09 - 2009-14 ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా రెండు సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీ హోరులో 2014లో నటుడు - నిర్మాత మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరిపై లక్షా 80వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

*మురళీ మోహన్ క్విట్.. ఆయన కోడలు తెరపైకి..

ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన మురళీ మోహన్ ఎందుకోగానీ మరోసారి ఎంపీగా పోటీచేయనని ప్రకటించారు.కానీ చంద్రబాబు ఊరుకోకుండా ఆయన కోడలు రూపను రాజమండ్రి ఎంపీ బరిలో నిలిపారు. ఈ టికెట్ ఆశించిన బొడ్డు భాస్కర రామారావు - గన్నికృష్ణలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు బుజ్జగించి మాగంటి రూపకు లైన్ క్లియర్ చేశారు. రూప మామ మురళీ మోహన్ అస్వస్థతకు గురైనప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. కార్యకర్తలు - నేతలకు అందుబాటులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు ఇదే కలిసివస్తుందని భావిస్తున్నారు.

*వైసీపీ నుంచి బీసీకార్డ్ మార్గాని మంత్రం ఫలించేనా?

మాగంటి రూప కమ్మ సామాజికవర్గం. ఆమెకు పోటీగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మార్గాని భరత్ ను దించింది. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అశేషంగా ఉన్న బీసీల ఓట్లు సాధించేందుకు వైసీపీ ఎత్తుగడ వేసింది. వీరంతా మార్గాని భరత్ వెంట నడిస్తే ఆయన గెలుపు అవకాశాలుంటాయి. యువకుడు, ఉత్సాహవంతుడు.. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కావడంతో ఈయనకు మంచి పేరు ఉంది. అదే ఎంపీగా గెలిపిస్తుందని ఆశిస్తున్నారు.

*జనసేనాని కాపు మంత్రి.. ఆకుల బలమైన క్యాండిడేటే..

కాపు సామాజికవర్గమైన ఆకుల సత్యనారాయణ జనసేన నుంచి రాజమండ్రి ఎంపీ బరిలో ఉన్నారు. ఈయనకు అశేషంగా ఉన్న కాపు ఓట్లు పడుతాయా లేదా అన్న దానిపైనే విజయావకాశాలుంటాయి. ఆకుల క్షేత్రస్థాయిలో బలమైన నేతే. ఈయనకు క్యాడర్ - ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా ఓట్లు చీల్చి టీడీపీ - వైసీపీ అభ్యర్థుల గెలుపు నిర్ధేశించే స్థాయిలో జనసేన అభ్యర్థి ఉన్నాడు. తేడా వస్తే గెలిచినా ఆశ్చర్యపోనక్కలేదంటున్నారు..

*త్రిముఖ పోటీ.. గెలుపు కష్టం..

రాజమండ్రి ఎంపీ బరిలో మూడు ప్రధాన పార్టీలు.. మూడు బలమైన సామాజికవర్గాల అభ్యర్థులను నిలబెట్టాయి. టీడీపీ-కమ్మ - వైసీపీ-బీసీ - జనసేన-కాపు.. అయితే బీసీ అయిన మార్గాని భరత్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ గాలి కూడా ఆయనకు అనుకూలంగా ఉంది. టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉండడం మాగంటి రూపకు కలిసివస్తోంది. ఇక జనసేన అభ్యర్థి ఎన్ని ఓట్లు చీలిస్తే అది టీడీపీకి అంత ప్లాస్ అవుతుందన్న నమ్మకం మాగంటి రూపలో కనిపిస్తోంది. బీఎస్పీ - కమ్యూనిస్టులు - ఎస్సీల మద్దతుతో జనసేన అభ్యర్థి బలంగా కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ త్రిముఖ పోటీలో రాజమండ్రి ఎంపీ సీటులో బోటాబోటీగానే ఎవరో ఒకరు గెలుస్తారు.. మరి ఈ టఫ్ ఫైట్ విజేతను చెప్పాలంటే ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే..