Begin typing your search above and press return to search.

ఆర్కే బీచ్ ఆందోళనకు టాలీవుడ్ అండ ఎంత?

By:  Tupaki Desk   |   23 Jan 2017 1:23 PM GMT
ఆర్కే బీచ్ ఆందోళనకు టాలీవుడ్ అండ ఎంత?
X
టాలీవుడ్ ప్రముఖులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. కోట్లాది రూపాయిల పారితోషికాలు తీసుకుంటే.. మధ్య మధ్యలో ఆటవిడుపుగా బ్రాండ్ ప్రమోషన్లతో రెండు చేతులా సంపాదిస్తున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు అయితే సినిమాలు చేసుకోవటం లేదంటే తమ వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటం తెలిసిందే. అమావాస్యకో పౌర్ణణానికో ఏదైనా ప్రకృతి విరుచుకుపడితే.. చిల్లర విదిల్చినట్లుగా మొక్కుబడి విరాళాలు ప్రకటించి.. మీడియా ముందు కాసింత హడావుడి చేసేవారు. అది సరిపోదనుకుంటే సినీ నటులంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడి కాసిన్ని చిల్లరను సేకరించి ప్రభుత్వానికి ఇవ్వటం ద్వారా తమకున్న సోషల్ యాంగిల్ ను పిచ్చపిచ్చగా ప్రదర్శించే వైనం మనం ఇప్పటివరకూ చూస్తున్నదే.

అయితే.. ఇలాంటి పులిహార యవ్వారాలు సరిపోవని.. అంతకు మించి చేయాల్సి ఉన్నవి చాలానేనన్న విషయాన్నిజల్లికట్టు వివాదంలో కోలీవుడ్ చిత్ర ప్రముఖులు తమ చేతల్లో చేసి చూపించారు.జల్లికట్టు ఇష్యూలో తమిళులకు అండగా నిలిచిన తమిళ సినీ ప్రముఖుల వైఖరితో.. విభజన వేళ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అంశంపై టాలీవుడ్ ప్రముఖులు నోరు విప్పరేనన్న ప్రశ్న పలువురి నోటి వెంట వస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉండగా..ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర ఏపీ యువత హోదా కోసం మౌన నిరసన చేపట్టాలని నిర్ణయించారు. దీనికి తన సాయం పూర్తిగా ఉంటుందని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీనికి తాము కూడా మద్దతు ఇస్తామని విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సైతం ఓకే చెప్పేశారు.

ఇదిలా ఉంటే.. ఏపీకి ఎంతో కీలకమైన హోదా అంశంపై టాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీల్ లైఫ్ లో పోటుగాళ్ల మాదిరి వ్యవహరిస్తూ.. తమ హీరోయిజాన్ని ప్రదర్శించే నాయకులు.. న్యాయమైన ఆంధ్రోళ్ల డిమాండ్ పై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వాదనను ట్వీట్ రూపంలో తేల్చేయటంతో పాటు.. మౌన దీక్షకు తాను సంపూర్ణ సహకారం అందిస్తానని వరుస ట్వీట్లతో తేల్చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు.. ఈ అంశంపై స్పందిస్తారన్నది ప్రశ్నగా మారింది. పవన్ తర్వాత ఆయనఫ్యామిలీ మెంబర్స్ చూస్తే.. చిరు.. అల్లు అరవింద్.. నాగబాబు.. చెర్రీ.. అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ ఇలా చెప్పుకుంటూ పోతే మెగా క్యాంప్ మొత్తం ఈ ఇష్యూలో ఏం చేయనున్నదన్నది ప్రశ్నగా మారింది. టాలీవుడ్ ప్రిన్స్ గా పేర్కొనే మహేశ్ బాబు రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన బావ ఏపీ ఎంపీగా వ్యవహరిస్తున్న వేళ.. మహేశ్ ఈ ఇష్యూ మీద మాట్లాడతారా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇక.. జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉండనుందన్నది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి. భారీగా ఫ్యాన్స్ బేస్ ఉన్న జూనియర్ ఫ్యాన్స్ లో సింహభాగం అధికార టీడీపీ నుంచి వస్తారన్న విషయాన్ని మర్చిపోలేం. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ లో నిర్వహించే మౌనదీక్షకు ఆయనెలా స్పందిస్తారన్నది ప్రశ్నగా మారింది. ఇక.. ప్రభాస్ లాంటి వాళ్లుసైతం ఈ ఇష్యూ మీద సైలెంట్ గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దీక్ష కారణంగా శాంతిభద్రతల కారణంగా ఏదైనా తేడా వస్తే బాధ్యత ఎవరిదన్నది ప్రశ్న అవుతుందని.. అందుకే.. దీన్లో ఇన్ వాల్వ్ కాకుండా తమ దారిన తాము వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. సీనియర్లు అంతా మనకెందుకులే అనుకుంటున్న వేళ.. ఆసక్తికరంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన యువ హీరోలు కొందరు మాత్రం ఏపీ ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వాలంటూ ఫేస్ బుక్ సాక్షిగా ప్రచారం షురూ చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/