Begin typing your search above and press return to search.

కడుపు తరుక్కుపోయే కేరళ ‘నిర్భయ’ దారుణం విన్నారా?

By:  Tupaki Desk   |   6 May 2016 4:40 AM GMT
కడుపు తరుక్కుపోయే కేరళ ‘నిర్భయ’ దారుణం విన్నారా?
X
కొన్ని దారుణాలు వింటే.. పగోడికి కూడా అలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదన్న భావన కలుగుతుంది. కేరళ నిర్భయగా అభివర్ణించే ఈ ఘటన వింటే మనసు అంతా చేదుగా అయిపోవటమే కాదు.. నిలువెత్తుగా విషాదం కమ్మేస్తుంది. ఎంత ప్రమాదకర సమాజంలో బతుకుతున్నామా? అన్న సందేహం కలిగేలా చేస్తుంది. మొత్తంగా.. హడలిపోయేలా ఉంటుందీ ఉదంతం. ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేయటమే కాదు.. దాదాపు 32కు పైగా కత్తిపోట్లు పొడిచేయటం.. ఆ ధాటికి ఆ అమ్మాయి పొట్ట పేగులన్నీ బయటకు రావటమే కాదు.. డాక్టర్లు సైతం ఆ అమాయకురాలిపై మానవమృగం చేసిన దాడికి.. పెట్టిన చిత్రహింసను ఊహించుకోవటానికే హడలిపోతున్న పరిస్థితి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు.. ఆ మధ్య ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసిన ఈ దారుణ హింసాకాండను ‘కేరళ నిర్భయ’ ఉదంతంగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం కేరళను అట్టుడికిపోయేలా చేయటమే కాదు.. ప్రధాని మోడీ సైతం సదరు బాధిత కుటుంబాన్ని త్వరలో పరామర్శిస్తారని చెబుతున్నారు. దేశ ప్రధానిని సైతం కదిలించిన ఈ ఘటనలోకి వెళితే..

బాగా చదువుకున్న వారుగా పేరున్న కేరళ రాష్ట్రంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్ కు చెందిన ఒక పేద దళితురాలి రాజేశ్వరి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వారి పేర్లు జిషా.. దీపలు. రాజేశ్వరి భర్త 2004లో ఇల్లు విడిచి వెళ్లిపోయిన నాటి నుంచి ఆకతాయిల చూపులు వీరి మీదే ఉండేవి. ఒంటరిగా ఉన్న ఈ మహిళల్ని చులకనగా చూడటం.. రాత్రి అయితే చాలు వారి ఇంటి వైపు ఆకతాయిల వెకిలి చేష్టలు ఎక్కువగా ఉండేవి. ఇంటి మీద రాళ్లు వేయటం.. టార్చ్ వేసి ఇబ్బంది పెట్టటం.. బయట వెళుతుంటే టీజ్ చేయటం.. ఇలా వేధించేవారు.

వీటికి తట్టుకోలేక తల్లి రాజేశ్వరి కొన్నేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఇక.. పెద్దమ్మాయి జిషా లా కోర్టు చేస్తోంది. త్వరలో ఆ కోర్సు పూర్తి అయ్యే పరిస్థితి. ఇదిలా ఉంటే.. తమ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటే వారికి కేరళ సర్కారు ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అందులో ఇంటి నిర్మాణం షురూ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆ ఇంటి నిర్మాణం చివర్లో ఉండగా ఆగిపోయింది.

త్వరలో కొత్త ఇంటికి మారాలని అనుకుంటున్న వేళ.. ఏప్రిల్ 28న ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. రాజేశ్వరి.. ఆమె చిన్న కుమార్తె బజారుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి.. ఇంట్లోకి వెళ్లేసరికి షాక్ తినే పరిస్థితి. ఆమె పెద్ద కుమార్తె జిషాను అత్యంత దారుణంగా హత్యకు గురైంది. పోలీసుల రంగప్రవేశం.. జిషా మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించిన వైద్యబృందం చెప్పిన మాటేమిటంటే.. అత్యంత దారుణంగా హింసకు గురి చేసి.. అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన కేరళనే కాదు.. మొత్తం దేశాన్ని కదిలించివేసింది. పోలీసుల విచారణలో తాజాగా బయటకు వచ్చిన విషయం ఏమిటంటే.. పసుపు రంగు టీ షర్టు ధరించిన యువకుడు ఒకడు ఆ ఇంటి నుంచి బయటకు రావటం తాము చూసినట్లుగా చెబుతున్నారు. ఈ పసుపురంగు టీ షర్ట్ ధరించిన మృగాడి కోసం పోలీసుల వేట సాగుతోంది. ఇంత అమానుషానికి పాల్పడ్డ ఆ రాక్షసుడికి ఎలాంటి శిక్ష వేయాలి..?