Begin typing your search above and press return to search.

హెల్త్ :పిల్లలకు పాలు ఇవ్వని తల్లులకు ఇదో హెచ్చరిక

By:  Tupaki Desk   |   9 Oct 2019 7:15 AM GMT
హెల్త్ :పిల్లలకు పాలు ఇవ్వని తల్లులకు ఇదో హెచ్చరిక
X
మన అమ్మమ్మలు - నానమ్మల కాలం నాటి సంగతి అదీ.. వాళ్లు మన నాన్నలు - అమ్మలకు సంవత్సరం పాటు పాలు ఇచ్చేవారని చెబుతుండేవాడు.. వీడు రెండేళ్లు పాలు తాగాడని సెటైర్లు వేసేవారు. కానీ నేటి తల్లులు..అందం కోసమో.. వక్షోజాలు - శరీర సౌష్టవం పాడవుతుందనే తమ కడుపున పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుండా డబ్బా పాలు పట్టేస్తున్నారు. కానీ దాని వల్ల ఎంత డేంజరో ఆ తల్లులు ఊహించడం లేదు. తల్లిపాలు ఈ సృష్టిలోనే అత్యంత పౌష్టికాహారమని పరిశోధనలో తేలింది.

తల్లిపాలు బిడ్డ శారీరక అవసరాలకు తగినట్లుగా మారుతూ ఉంటాయి. కాన్పు అయిన మొదటిరోజు నుంచి నాలుగు రోజుల వరకు ముర్రుపాల(కొలస్ట్రమ్)ని అమృతతుల్యం అని చెప్పుకోవచ్చు. బిడ్డకు అవసరమైన తొలి పోషణ - రక్షణ లభించేది దీని నుంచే. 5-14 రోజుల వరకు వచ్చే తల్లిపాలు వేగంగా పెరిగే బిడ్డ శరీర అవసరాలకు తగినట్టుగా ఉండి బిడ్డకు గొప్ప శక్తిని అందిస్తాయి. ఈ పాలల్లో లాక్టోజ్ - కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. రెండు వారాలు తర్వాత పాలు మామూలు దశకు చేరుతాయి. ఇందులో 90 శాతం నీరు - పిండిపదార్థాలు - విటమిన్లు 2 శాతం - ప్రొటీన్లు - కొవ్వులు 8 శాతం - ఉండి బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు సాయం చేస్తాయి. మామూలు కాన్పు అయినా - సిజేరియన్ అయినా సరే వీలైనంత త్వరగా బిడ్డకు తల్లిపాలను ఇవ్వడం ప్రారంభించాలి.

తల్లిపాల వల్ల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెంది పిల్లలు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. ఎక్కువ కాలం తల్లిపాలు తాగిన పిల్లలకి భవిష్యత్తులో మధుమేహం - అధిక బరువు - కేన్సర్ వంటి ముప్పులు తక్కువగా ఉంటాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువకాలం ఇన్‌ ఫెక్షన్లు - మరణాల ముప్పు తక్కువగా ఉండడంతో పాటు - ఆ పిల్లల్లో తెలివితేటలు అధికంగా ఉంటాయి.తల్లిపాలల్లో ‘హ్యూమన్ ఓలిగోసాక్రైడ్లు’ ఉండే ఒక రకమైన చక్కెరలు పేగుల్లోని చెడు బాక్టీరియాను తగ్గించి - మంచి బాక్టీరియాను తయారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

పసి పిల్లలు ఆకలి వేసినప్పుడే కాదు - దాహం వేసినా - తల్లి స్పర్శ కావాలన్నా తల్లిపాల కోసం వెతుక్కుంటారు. పిల్లలకు ఆరు నెలలు నిండేంత వరకు తల్లిపాలు తప్ప మరే ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆరునెలల తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇస్తూనే ఘనాహారం ఇవ్వడం ప్రారంభించాలి. ఇలా తల్లిపాలను పిల్లలు రెండు సంవత్సరాలు నిండే వరకూ కొనసాగించాలి.

తల్లిపాలు చాలా సురక్షితం. అందువల్ల పిల్లలకి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రావు. పోతపాలతో చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీసాలను సరిగా శుభ్రం చేయకపోయినా - కలిపి ఉంచిన పాలను శిశువుకు తాగించినా విరోచనాలు అవుతాయి. ఇవేకాకుండా ఊపిరితిత్తుల్లో నెమ్ము - గొంతునొప్పి - పిప్పిపళ్లు వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి.

తల్లిపాలు తాగిన పిల్లలకు ఐక్యూ (తెలివి తేటలు) ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకి అలర్జీలు - అస్థమా ముప్పు తగ్గుతుంది. ఆరు నెలల వరకూ పూర్తిగా తల్లిపాల మీద ఆధారపడే పిల్లలకు చెవి ఇన్‌ ఫెక్షన్లు - విరేచనాల సమస్యలు - శ్వాసకోశ జబ్బులు - వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా తల్లుల అందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన వారం అంటే ఆగస్ట్ 1 నుంచి 7 వరకు 120 పైగా దేశాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ వారంగా జరిపి - కాబోయే అమ్మలకి - కొత్తగా తల్లులైన వారికి అవగాహన కలిపిస్తున్నారు. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ శరీర అవయవాలు ఒక విధంగా అభివృద్ధి చెందితే - బిడ్డ పుట్టిన తరువాత శరీర అవయవాల అభివృద్ధి మూడు నెలల్లో రెట్టింపుగా పెరుగుతాయి. కారణం ఒక్కటే. తల్లిపాలు.ఎన్నో విశేషాలు ఉన్న తల్లిపాలను భారతదేశంలో కేవలం 37 శాతం మంది పిల్లలే ఆరునెలల వరకు తాగుతున్నారు అంటే పిల్లలకి ఎంత తక్కువ పాళ్ళల్లో తల్లి పాలు అందిస్తున్నారో అర్ధం అవుతోంది. కొంతమంది వక్షోజాల అందం తగ్గుతుందనో - లేదా ఇచ్చే వెసులుబాటు లేకపోవడమో కానీ చాలామంది శిశువులకి తల్లిపాలు రుచి అందడం లేదు. నిజానికి చనుబాలు పిల్లలకు ప్రత్యేక ఔషధంగా పనిచేస్తాయి. తల్లిపాలను సరిగ్గా పిల్లలకి ఇవ్వగలిగితే ఏటా 8.23 లక్షల మంది పిల్లలను ఐదేళ్లలోపు మరణించకుండా కాపాడుకోవచ్చు. పిల్లలకు చనుబాలు ఇవ్వకపోవడం వల్ల - రొమ్ము కేన్సర్లతో మరణిస్తున్న మహిళల సంఖ్య 20 వేల వరకు ఉంది అంటే ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు... తల్లిపాలతో పిల్లలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు అని వైద్యులు చెప్తున్నారు.