Begin typing your search above and press return to search.

పెద్ద రచ్చే చేసిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ

By:  Tupaki Desk   |   22 Feb 2017 9:25 AM GMT
పెద్ద రచ్చే చేసిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ
X
కోర్టు నుంచి అనుమతులు లేకపోవటం.. పోలీసుల ఉక్కుపాదం.. తెల్లవారు జాము కాకముందే ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఉద్యమ నేతను అరెస్ట్ చేసిన వేళ.. తెలంగాణలో నిర్వహించాలని భావించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ ఎలా జరుగుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. సందేహాల్ని పటాపంచలు చేస్తూ హైదరాబాద్ లోని విద్యార్థులు నిరసన కదం తొక్కారు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీని నిర్వహించేందుకు విపరీతంగా ప్రయత్నించారు.

ఉద్యమ కేంద్రాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం.. నిజాం కాలేజీలు నిలిచాయి. ఇవి కాకుండా పలు ప్రాంతాల్లోనూ విద్యార్థులు.. విద్యార్థి సంఘాలు సమూహంగా మారి.. నిరసన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాంతం ఏదైనా.. నిరసన పేరుతో బయటకు వచ్చే వారి పట్ల తెలంగాణ పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.

ఇక.. ఉద్యమ కేంద్రాలుగా నిలిచిన ఉస్మానియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమ రోజుల్ని గుర్తుకు తెచ్చేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తుననినాదాలు చేస్తూ.. వర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. అందుకు పోలీసులు అడ్డుకోవటంతో.. ఇరువురి మధ్యవాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. వర్సిటీ నుంచి విద్యార్థులు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారు.

ఇలాంటి పరిస్థితే నిజాం కాలేజ్ లోనూ చోటు చేసుకుంది. విద్యార్థులు.. పోలీసుల మధ్య నెలకొన్నఉద్రిక్త పరిస్థితులు శ్రుతిమించాయి. పోలీసులపైన నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు గాయపడ్డారు. నగరంలోని పలు చోట్ల విద్యార్థులు నిరసన ప్రదర్శనల్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ప్రయత్నం చేసిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీకి ఎక్కడా అనుమతి ఇవ్వలేదు.

సికింద్రాబాద్.. బాగ్ లింగంపల్లి.. కామలిపురా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. ఎల్ బీ నగర్.. తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక.. నిరసన ర్యాలీని నిర్వహించాలని భావించిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్దకు ఆందోళనకారులు ఏ మాత్రం వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక్కడి భద్రత కోసం ఏకంగా ఐదుగురు ఏసీపీలు.. 20 మంది సీఐలు.. 200 మంది పోలీసుల్ని నియమించారు. మొత్తంగా చూస్తే.. నిరసన ర్యాలీని నిర్వహించకుండా చేయటంలో పోలీసులు విజయం సాధించారనే చెప్పాలి. కాకుంటే.. ఇందుకోసం వారు చెమటలు చిందించాల్సి వచ్చింది. కోదండం మాష్టారి పిలుపు తీవ్రత ఎంతగా ఉంటుందన్నది పోలీసులకు అర్థమై ఉంటుందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/