Begin typing your search above and press return to search.

తెలంగాణ తమ్ముళ్లు మరీ ఎక్కువ ఆశిస్తున్నారా?

By:  Tupaki Desk   |   4 May 2016 5:20 AM GMT
తెలంగాణ తమ్ముళ్లు మరీ ఎక్కువ ఆశిస్తున్నారా?
X
ఆంధ్రాపార్టీ ఒకటి అంతర్ధానమైంది. మరికొద్దిరోజుల్లో తెలంగాణలో మరో ఆంధ్రా పార్టీ తెలుగుదేశం కూడా అంతర్ధానం కానుంది’’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య చేయటం తెలిసిందే. కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాట నిజం కాకుండా చేయాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారా? ఇందుకోసం చంద్రబాబు ఊహించని పనులు చేసేందుకు సిద్ధం కానున్నారా? అన్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు పెద్దగా లేదనే చెప్పాలి. నిష్ఠురంగా అనిపించినా ఇది నిజం. ఒకప్పుడు తెలంగాణ మారుమూల గ్రామాల్లో తెలుగుదేశం క్యాడర్ బలంగా ఉండేది. నాయకులతో పాటు.. ద్వితియశ్రేణి నాయకులు సైతం ‘కారు’ ఎక్కేయటంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీని ఆంధ్రాపార్టీగా టీఆర్ ఎస్ అభివర్ణించటం.. ఇదే అంశాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి మొదలు అధికారపార్టీకి చెందిన నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేయటం.. దీనికి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం ఇవ్వని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రాపార్టీగా తెలంగాణ ప్రజలు భావించే పరిస్థితి. ప్రజల మైండ్ సెట్ కు తగ్గట్లే తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు టీఆర్ ఎస్ లోకి జంప్ అయ్యారు. దీంతో.. ఒకప్పుడు వెలిగిపోయిన టీడీపీ.. ఈ రోజు పట్టుమని పది మంది నేతలు కూడా లేని దుస్థితి.

ఇక.. టీడీపీ తరఫున తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు మిగిలింది ముగ్గురు మాత్రమే. వారిలో కృష్ణయ్య పార్టీకి సంబంధం లేకుండా తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కాకుండా ఉన్నది రేవంత్.. సండ్రలు మాత్రమే. ఇదిలా ఉంటే.. తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు.. పార్టీ ఉనికి కాపాడుకునేందుకు బాబు ముందు తెలంగాణ తెలుగుదేశం నేతలు గొంతెమ్మ కోర్కెలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

తాజాగా జరిగిన పాలిట్ బ్యూరో సమావేశానికి హాజరైన తెలంగాణ తెలుగుదేశం నేతలు.. తమకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని.. దీంతోపాటు ఒక కేంద్రమంత్రి పదవిని ఇప్పించాలని కోరినట్లుగా తెలుస్తోంది.ఇవే కాక.. టీటీడీలో బోర్డు మెంబర్ గా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణికి అవకాశం ఇవ్వాలని చెప్పినట్లుగా సమాచారం. ఇవేకాదు.. ఎపీపీఎస్సీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక నేతకు సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు.. చట్టప్రకారం సాధ్యమా? అన్న అంశాన్ని చూసి చెప్పాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. చూస్తుంటే.. తెలంగాణలో పార్టీని బతికించుకోవటానికి టీడీపీ అధినేత చంద్రబాబు భారీగా పదవుల పందేరం చేయాల్సి ఉంటుందన్న మాట. మరి.. తెలంగాణ తమ్ముళ్ల కోరికల్ని ఎంతమేర తీరుస్తారో చూడాలి.