Begin typing your search above and press return to search.

ముంబై నుంచి తరలొస్తున్న తెలంగాణ వాసులు

By:  Tupaki Desk   |   5 Dec 2018 9:40 AM GMT
ముంబై నుంచి తరలొస్తున్న తెలంగాణ వాసులు
X
తెలంగాణ ఎన్నికలు పక్కరాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి. ఏపీలో ఇప్పటికే తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. పక్కనున్న మహారాష్ట్రలోనూ ఆసక్తి పెరిగింది. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా ఇప్పుడు ఓట్ల పండుగకు తెలంగాణకు పయనమయ్యారు. ఇప్పటికే వచ్చిన కొందరు ప్రచారంలోనూ తమ కిష్టమైన పార్టీ తరుఫున పాల్గొంటున్నారు.

కాగా అభ్యర్థులు తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారి పై ప్రత్యేక దృష్టి సారించారు. ముంబై సహా తెలంగాణ వాళ్లు ఎక్కడున్న వారికి రవాణా చార్జీలతోపాటు ఓట్ల ఎక్కువగా ఉంటే మంచి ప్యాకేజీలు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు.

మహారాష్ట్రలో తెలుగు వారి జనాభా ఎక్కువ. ముంబై, భీవండి, షోలాపూర్, ఫుణేల్లో దాదాపు కోటి మంది వరకు తెలుగు వారు ఉంటారని అంచనా. ముంబైలోనే సుమారు 10 లక్షల మంది ఉంటారు. వీరిలో తెలంగాణ వారు 70శాతం వరకూ ఉంటారు. ఇందులో కరీంనగర్ వారే ఎక్కువ. ఆ తర్వాత నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన వారు మహారాష్ట్రలో జీవిస్తున్నారు. తెలంగాణలో ఓటేసేందుకు చాలా మంది మహారాష్ట్రలో ఉన్న ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.

ముంబైలోనూ తెలంగాణలోని పార్టీల సానుభూతి పరులు ఓట్ల ప్రచారాన్ని చేస్తున్నారు. అభ్యర్థులు తెలంగాణకు వెళ్లి ఓటేస్తే బస్సు, రైలు చార్జీలతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ వారు అయితే ఓటు హక్కు ఉంటే 20శాతం రాయితీ కూడా ప్రకటించారు.వీరికి మందు, విందు, నగదును కూడా ఆఫర్ చేస్తూ సొంత వాహనాల్లో తరలిస్తున్నారు.

ఫుణేలోని పాషాణ్ లో మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట్ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది నివసిస్తుంటారు. అక్కడ స్థిరపడ్డ నాలుగువేల మంది అంతా ఇప్పుడు తమ ఓటు హక్కును తెలంగాణలో వినియోగించుకునేందుకు వస్తున్నారు. కొందరికి స్తానిక అభ్యర్థులు వాహనాలు సమకూర్చి మరి తీసుకువస్తుండడం విశేషం.