Begin typing your search above and press return to search.

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో సిత్రాలు: అత్తా కోడ‌ళ్లు, బాబాయ్‌ -కొడుకుల పోరు!

By:  Tupaki Desk   |   21 Jan 2019 6:14 AM GMT
స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో సిత్రాలు: అత్తా కోడ‌ళ్లు, బాబాయ్‌ -కొడుకుల పోరు!
X
అధికార‌మంటే ఎవ‌రికి చేదు చెప్పండి..! చాలామంది వాటి కోసం ఎంత‌టి ప‌ని చేయ‌డానికైనా సిద్ధ‌మ‌వుతుంటారు. బంధాల‌నూ కాద‌నుకుంటుంటారు! తాజాగా తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి ప‌రిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ప‌లుచోట్ల‌ స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ర‌క్త సంబంధీకులే ప‌ర‌స్ప‌రం పోటీకి దిగుతున్నారు.
గ్రామాల్లో స‌ర్పంచ్ ప‌ద‌వికి ఉన్న పోటీ అంతా ఇంతా కాదు. ఆ ప‌ద‌వికి కేసీఆర్ ప్ర‌భుత్వం క‌ల్పించిన ప‌వ‌ర్స్ అలాంటివి మ‌రి. అందుకే ఇప్పుడు స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం బంధాలు, బంధుత్వాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప‌లువురు పోటీ ప‌డుతున్నారు. న‌ల్గొండ జిల్లా నిడ‌మ‌నూరు మండలంలోని బంకాపురంలో వరుసకు అత్తా కోడలు అయిన ఉన్నం కౌసల్య, ఉన్నం శోభ ఎన్నికల బరిలో నిల‌వ‌డం ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌.

బంకాపురం సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు కేయించారు. ఇక్కడ గత సర్పంచ్‌ గా పనిచేసిన ఉన్నం శోభ తిరిగి పోటీ చేస్తుండగా ఆమె అత్త అయిన ఉన్నం కౌసల్య కొత్తగా బరిలో నిలిచారు. ఉన్నం శోభ భర్త కాంగ్రెస్‌ పార్టీకి చెందిన‌వారు. కౌసల్య భర్త ఉన్నం వెంకటేశ్వర్లు టీఆర్ ఎస్‌ నాయకుడు. ఉన్నం చిన వెంకటేశ్వర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి టీఆర్ ఎస్‌ లో చేరారు. జనరల్‌ మహిళ కావడంతో తన సతీమణిని రంగంలోకి దింపి గెలుపు కోసం పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.
న‌ల్గొండ జిల్లాలోనే త్రిపురారం మేజర్‌ గ్రామ పంచాయతీలోనూ ఇలాంటి ప‌రిణామ‌మే చోటుచేసుకుంటోంది.

ఇక్క‌డ సర్పంచ్‌ పదవి కోసం సొంత బాబాయి, అబ్బాయి పోటీపడుతున్నారు. ఇంటి పేరుతో పాటు వారి పేర్లు కూడా ఒక్కటే కావడం విశే షం. తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న అనుముల శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్ ఎస్‌ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. త్రిపురారం సొసైటీ మాజీ చైర్మన్ - కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు అనుముల శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచారు. వీరిద్దరు సొంత బాబాయి-కుమారుడు వరుస బంధువులు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు స్థానాలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో ర‌క్త సంబంధీకులు ఇలాగే ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు.