Begin typing your search above and press return to search.

అమెరికాలో దారుణం.. తెలుగోడి కాల్చివేత..

By:  Tupaki Desk   |   21 Feb 2019 5:09 AM GMT
అమెరికాలో దారుణం.. తెలుగోడి కాల్చివేత..
X
అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ పేలింది. కానీ ఈ సారి ఆ తుపాకీకి ఓ తెలుగు వాడు బలైపోవడం విషాదం నింపింది. అమెరికాలోని గన్ కల్చర్ కు ఇప్పటికే చాలామంది అసువులు బాస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్ పేటకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డి (50).. ఓ నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.

రహీంఖాన్ పేటలో ప్రాథమిక విద్య, హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన గోవర్ధన్ రెడ్డి వివిధ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. దీంతో ఎన్నో ఆశలతో స్నేహితుల సాయంతో అమెరికా వెళ్లాడు. అక్కడ ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగు ధరించిన ఓ నల్లజాతీయుడు తుపాకీతో స్టోర్ లోకి వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తూటాలు తగిలి గోవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గోవర్ధన్ భార్య శోభారాణి తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తూ హైదరాబాద్ లోని ఉప్పల్ లో నివాసం ఉంటోంది. గోవర్ధన్ రెడ్డి ఈ దసరాకు అమెరికా నుంచి పూర్తిగా వచ్చేసి హైదరాబాద్ లో స్థిరపడుతానని ప్లాన్ చేశాడు. అంతలోనే ఆయన మరణం కలిచివేస్తోంది. మృతదేహాన్ని అమెరికా నుంచి త్వరగా తీసుకురావాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను మృతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమెరికా తెలుగు సంఘాలతో కూడా ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.