Begin typing your search above and press return to search.

కుర్రాళ్లు.. కేసీఆర్ ను అంత‌లా క‌డిగేస్తున్నారే!

By:  Tupaki Desk   |   24 April 2019 4:43 AM GMT
కుర్రాళ్లు.. కేసీఆర్ ను అంత‌లా క‌డిగేస్తున్నారే!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేసే ద‌మ్ము.. ధైర్యం రాజ‌కీయ నేత‌ల‌కు సైతం లేద‌న్న వేళ‌.. ఒక కుర్రాడు చేసిన తీవ్ర వ్యాఖ్య ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇంట‌ర్ బోర్డు నిర్వాకంతో వేలాది మంది విద్యార్థులు త‌మ‌కు మేలు చేయాలంటూ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నా ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ల‌నం లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన ప‌లువురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.

దీనిపై ప‌లువురు విద్యార్థులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఊహించ‌ని రీతిలో రెండు అంశాల్ని లింక్ చేసి ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా వాద‌న‌ను వినిపించారు. శ్రీ‌లంక‌లో జ‌రిగిన బాంబుపేలుళ్ల‌ను ఖండిస్తూ త‌న స్పంద‌న‌ను తెలియ‌జేసిన సీఎం కేసీఆర్‌.. ఇంట‌ర్ బోర్డు వైఫ‌ల్యం కార‌ణంగా తెలంగాణ బిడ్డ‌లు చ‌నిపోతే ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు ఎందుకు? అని సూటిగా ప్ర‌శ్నించారు.

బంగారు తెలంగాణ చేస్తాన‌ని కేసీఆర్ చెబుతార‌ని.. కాని ఇప్పుడు న‌డుస్తోంది ఇనుము తెలంగాణ అని చెప్పారు. ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే తెలంగాణ నాశ‌న‌మ‌వుతుంద‌ని.. మ‌రోవైపు ఏపీ పుంజుకుంటోద‌ని వ్యాఖ్యానించారు. రాయ‌లేని కొన్ని మాట‌ల్ని అదాటున అనేసిన కుర్రాడి మాట‌ల్లో కొన్నింటిని సెన్సార్ చేసి రాయాల్సిన పరిస్థితి.

మూడు నెల‌ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన తీరుకు భిన్నంగా.. ఇప్పుడు క‌డిగేస్తున్న వైనం అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న చిన్న కుర్రాళ్లు.. రాజ‌కీయాల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోని త‌రం ఒక‌టి.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్న వైనం ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌గా భావించాల్సిన అవ‌స‌రం ఉంది.