Begin typing your search above and press return to search.

తెలంగాణ అధికారులకు వర్క్ ఫ్రం హోం ఛాన్సు

By:  Tupaki Desk   |   26 July 2016 7:43 AM GMT
తెలంగాణ అధికారులకు వర్క్ ఫ్రం హోం ఛాన్సు
X
వర్క్ ఫ్రం హోం... కార్పొరేట్ రంగంలోని కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు సంస్థలు ఇలాంటి అవకాశం కల్పిస్తున్నాయి. అంటే... ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి నుంచే పనిచేసి కార్యాలయానికి ఆ పనిని సబ్ మిట్ చేయడమన్నమాట. గవర్నమెంటు ఆఫీసుల్లో ఇలాంటి సౌకర్యం కల్పించే ఛాన్సే ఉండదనుకుంటాం. ఎందుకంటే... ఆఫీసుకు వస్తేనే సరిగా పనిచేయరన్న మంచి పేరు గవర్నమెంటు ఉద్యోగులకు ఉంది. అలాంటప్పుడు ఇంటి నుంచి పనిచేయమంటే అంతే సంగతులు. కానీ... అందరికంటే భిన్నంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడానికి రెడీ అవుతోంది. అయితే..,. ఇది అందరికీ కాదు - పైగా అన్ని వేళలా కాదు. సెక్రటేరియట్ భవనాన్ని కూల్చి కొత్తది కట్టే క్రమంలో కొంతకాలం హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంట్సు వరకు ఈ ఛాన్సిస్తున్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా నూతన సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ తన యంత్రాంగానికి ఈ సరికొత్త వెసులుబాటు కల్పించబోతున్నారు. కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టేంత వరకూ మంత్రులు - ఉన్నతాధికారులకు ఇళ్ళల్లోంచే నిధులు నిర్వర్తించేలా అవ కాశం కల్పించాలని నిర్ణయించారు. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో ఉన్న విధంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే ఆలోచనతో ఉన్నారు. మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారులు - ముఖ్య కార్యదర్శితో పాటు ఆ పైస్థాయి హోదా కలిగిన ఐఏఎస్‌ అధికారులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రూల్‌ను అమలు చేయనున్నారు. ఏడాదిలోగా కొత్త సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎంతలేదన్నా గరిష్టంగా రెండేళ్ళ సమయం అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా సంపూర్ణ వాస్తు - సకల సౌకర్యాలతో ముఖ్యమంత్రి నూతన క్యాంపు కార్యాలయం మెరుగులు దిద్దుకుంటోంది. విజయ దశమి పర్వదినాన కేసీఆర్‌ నూతన భవనంలోకి అడుగు పెడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో అధికార నివాసాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ప్రద్రేశ్‌ లో నిర్మించ తలపెట్టిన సచివాలయాన్ని తలదన్నే విధంగా, ఇప్పటివరకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సరికొత్త నమూనాలో సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్‌ తల పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో సచివాలయాన్నే ఇతర ప్రాంతానికి మార్చాలనుకున్నప్పటికీ - ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆ ప్రతిపాదనను విరమించు కున్నారాయన. కొత్తది నిర్మించేవరకు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయాలను సచివాలయం ముందున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అన్ని శాఖల ముఖ్యకార్యదర్శుల కార్యాలయాలను నాంపల్లిలోని ఎనిమిది అంతస్తులున్న గృహకల్ప భవన సముదాయంలో తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడున్న కార్యాలయాలను ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసేందుకు జీఏడీ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇదంతా ఎలా ఉన్నా వర్క్ ఫ్రం హోం నిర్ణయంతో ఉన్నతాధికులు చాలా సంతోషిస్తున్నారట.