Begin typing your search above and press return to search.

ఆ 42,500 జీవోల్లో ఏముంది కేసీఆర్..ఎందుకంత రహస్యం?

By:  Tupaki Desk   |   18 Sep 2019 11:12 AM GMT
ఆ 42,500 జీవోల్లో ఏముంది కేసీఆర్..ఎందుకంత రహస్యం?
X
కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు మరో షాకిచ్చింది. ఇప్పటికే సెక్రటేరియట్ భవనాల విషయంలో కేసీఆర్‌కు పలుమార్లు మొట్టికాయలు వేసిన కోర్టు తాజాగా మరో విషయంలోనూ తలంటింది. ప్రభుత్వం జారీ చేసే జీవోల విషయంలో పారదర్శకంగా ఉండాలని - రహస్య జీవోలు - దొడ్డిదారి జీవోలు చెల్లవని - అన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని సూచించింది.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలందరూ చూసే విధంగా ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారించి ఈమేరకు ఆదేశించింది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేరాల శేఖర్ అనే వ్యక్తి ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇప్పటివరకూ లక్షకు పైగా జీవోలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయగా అందులో 42,500 జీవోలను వెబ్‌ సైట్లలో పొందుపరచలేదని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఎర్రమంజిల్‌ భవనం విషయంలోనూ ఇప్పటికే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎర్రమంజిల్‌ లోని చారిత్రక భవనాన్ని కూల్చొద్దనీ - కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఆ భవనాన్ని కూల్చివేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం రద్దు చేసింది. ఎర్రమంజిల్‌ లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం రద్దుచేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ - న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం తీర్పు వెలువరించింది. అక్కడికి రెండు రోజుల్లోనూ మరో కీలక ఆదేశం ఇస్తూ జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో కేసీఆర్ పాలన పారదర్శకంగా లేదన్న విమర్శలకు ఊతమిచ్చినట్లయింది.