Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ పీఠం క‌దులుతోందా?

By:  Tupaki Desk   |   21 Jun 2018 5:44 AM GMT
ఉత్త‌మ్ పీఠం క‌దులుతోందా?
X
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమ కార్యకర్తల్లో జోష్‌ నింపాల్సిన నేతలే కుమ్ములాడుకుంటున్నారు. తామంతా ఒక్కటే అని పలు వేదికలపై చెబుకుంటున్నా... లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారు. అందరూ అగ్రనేతలే ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి. అధిష్టానం వద్ద తమ పరపతిని పెంచుకునేందుకు ఓ వైపు యత్నిస్తూనే..మరోవైపు అంతర్గత కుమ్ములాటలకు ఆజ్యం పోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై పట్టు సాధించడానికి రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తుంటే...ఆయా జిల్లాలు - నియోజకవర్గాలలో పట్టున్న నేతలు తమ దారి తమదే అన్నట్టు ముందుకెళ్తున్నారు. ఈ ప‌రిస్థితి చోటుచేసుకుంది మ‌రే పార్టీలోనో కాదు....తెలంగాణ ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షంగా ఉండి..అధికారం కోసం ఆరాట‌ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీ.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క - సీనియర్‌ నేతలు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి - డికే అరుణ - రాజ్‌ గోపాల్‌ రెడ్డి - శ్రీధర్‌ బాబు - రేవంత్‌ రెడ్డి - కేఎల్ ఆర్‌ - బండ కార్తీకరెడ్డి - గండ్ర వెంకటరమణరెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత రాహుల్‌ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన నేతలు అనంతరం రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహారశైలిపై రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఒంటెద్దు పోకడల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాహుల్‌ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పార్టీ సీనియర్‌ నేతలతో మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పినట్లు సమాచారం. జిల్లాల్లోని సీనియర్‌ నాయకులను బలహీన పరిచేలా వ్యతిరేక గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయనను కొనసాగిస్తే పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆయనను తప్పించి మరొకరికి పీసీసీ అప్పగించాలని కోరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలపై సమయం ఇచ్చిన తరహాలోనే తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత లతో సమావేశం నిర్వహించాలని కోరారు. దీనిపై త్వరలోనే నిర్ణ యం తీసుకుంటానని రాహుల్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలాఉంగా...కొంత మంది కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లి నాపై ఫిర్యాదు చేయడానికి అన్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, రాహుల్‌ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకేనని టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. ఉత్తమ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం గాంధీభవన్‌ లో తనను కలిసిన విలేకరులతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. సర్పంచుల రిజర్వేషన్లు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు. సర్పంచ్‌ రిజర్వేషన్లు లోపభూయిష్టంగా ఉండడంతో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. సామాజికవర్గాల వారీగా సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఎందుకు బయటపెట్టలేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ ప్రాతిపదికన - ఎంత శాతం రిజర్వేషన్‌ ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.