Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ కోలుకోవ‌డం అయ్యేప‌ని కాదా?

By:  Tupaki Desk   |   17 Dec 2018 4:38 AM GMT
టీ కాంగ్రెస్ కోలుకోవ‌డం అయ్యేప‌ని కాదా?
X
రంగురంగుల లైట్లు - కటౌట్లు - నేతలు - కార్యకర్తల హడావుడి...ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాల‌య‌మైన గాంధీభ‌వ‌న్ ప‌రిస్థితి. ఇప్పుడు కాదండోయ్‌... ఫలితాల వెల్లడికి ముందురోజు వరకు! అలా సంద‌డిగా కళకళలాడిన గాంధీభవన్ వారం రోజులుగా బోసిపోయింది. ఓటమి తర్వాత పెద్ద నాయకులెవరూ అటువైపు రావడంలేదు. జిల్లాల నుంచి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు వచ్చినా వారికి రాష్ట్ర నాయకులు కలువడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్‌కు గురైన కాంగ్రెస్ నేతలు ఇంకా తేరుకోలేదు. పార్టీ అధిష్ఠానం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేసినా ఫలితాలు దారుణంగా ఉండటం, ఉద్దండులుగా భావించిన సీనియర్ నేతలు సైతం ఓడిపోవడంతో నాయకులు - కార్యకర్తలు నైరాశ్యంలో పడ్డారు. కొందరైతే ఏకంగా రాజకీయాలకు స్వస్తి పలకాలని భావిస్తున్నారు. ఓ పక్క రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఓటమి నుంచి తేరుకోలేక ఇళ్ల‌కే పరిమితమయ్యారు. దీంతో కాంగ్రెస్ నేత‌ల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది.

గడువులోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలోని ప్రభుత్వం ప్రకటించి - ఏర్పాట్లు చేస్తున్నా... కాంగ్రెస్‌ లో ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదు. కనీసం పార్టీలోని కిందిస్థాయి నాయకులు - కార్యకర్తలకు ఎవరూ భరోసా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా? లేదా..? అనేది తేలడం లేదు. ఒకవేళ మద్దతు ఇస్తే ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేసే నాయకులు కరువయ్యారు. ఇదే స‌మ‌యంలో టీఆర్ ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప‌ర్వంపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీ అధికారం త‌మదేన‌ని ప్ర‌కటించుకున్న పార్టీ నుంచి ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డం ఆ పార్టీ పరిస్థితిని చూపుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

కాగా, మ‌రో కీల‌క ప‌రిణామం గురించి సాక్షాత్తు కాంగ్రెస్ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో గాంధీభ‌వ‌న్‌ లో తాత్కాలిక ఏఐసీసీ కార్యాలయం కూడా పనిచేసింది. ఏఐసీసీ నాయకులు - ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన నేతలంతా హడావుడి చేశారు. టీపీసీసీని లెక్క చేయకుండా అంతా తామై వ్యవహరించారు. ఫలితాలు వెల్లడై కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత వారంతా మూటాముల్లె సర్దేశారు. తాత్కాలిక ఏఐసీసీ కార్యాలయం ఎత్తేశారు. ఇటు రాష్ట్ర నాయ‌కులు రాక‌..అటు జాతీయ నాయ‌కుల అడ్ర‌స్‌ లేక మొత్తం గాంధీభవన్‌ కే తాళాలు వేసే పరిస్థితి వచ్చిందని కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌టం కొస‌మెరుపు.