Begin typing your search above and press return to search.

రాహుల్ రాక‌ముందే..టీ కాంగ్ నేత‌ల్లో క‌ల‌వ‌రం

By:  Tupaki Desk   |   21 Nov 2017 6:23 PM GMT
రాహుల్ రాక‌ముందే..టీ కాంగ్ నేత‌ల్లో క‌ల‌వ‌రం
X
ఇటీవ‌ల దూకుడు మీదున్న తెలంగాణ కాంగ్రెస్‌ లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీకి ప‌ట్టాభిషేకం ఖరారు అయిపోయిన నేప‌థ్యంలో...త‌మ‌కు ఇది మేలు చేస్తుందా..చేటు చేస్తుందా...లాభ‌మేంటి న‌ష్ట‌మేంటి అని టీ కాంగ్రెస్ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రాహుల్ పర్యటనలూ ఉంటాయని, వివిధ కారణాలతో పార్టీని వీడిన సీనియర్లను మళ్లీ వెనక్కి పిలిపించేందుకు కృషి జరుగుతుందన్న సమాచారం ఉంది.

మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో రాహుల్ టీంలో త‌మ‌కు బెర్త్ ద‌క్కుతుందా ద‌క్కితే ఏ బెర్త్ అనే చ‌ర్చ సీనియ‌ర్ల‌లో మొద‌లైంది. సీడబ్ల్యూసీ ఆశావాహుల్లో కేంద్ర తాజా మాజీ మంత్రులు ఎస్ జైపాల్‌ రెడ్డి - బలరాం నాయక్ - సర్వే సత్యనారాయణ ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పీసీసీ మాజీ అధ్యక్షుడు - మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన పొన్నాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అభిమానులు - పార్టీ నేతలు - కార్యకర్తలూ అంటున్నారు. జైపాల్‌ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు కాబట్టి ఆయనకూ ఛాన్స్ లేకపోలేదని పార్టీ నేతల అంచనా. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఏఐసీసీ కార్యవర్గంలో లేదా సీడబ్ల్యుసీలో తప్పని సరిగా చోటు దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు పైగా ఎస్సీ (మాదిగ) కాబట్టి తప్పని సరిగా స్థానం లభిస్తుందని సర్వే అనుయాయులు అంటున్నారు.

ఏఐసీసీ కార్యదర్శిగా - మాజీ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించి సోనియా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నవి. హనుమంత రావుకు తప్పని సరిగా ఏఐసీసీలో కీలకమైన పదవి లభిస్తుందని పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా - ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు లోగడ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా సిఫార్సు చేసినట్లు సమాచారం. లోగడ సీడబ్ల్యుసీలో జి వెంకటస్వామి - కె. కేశవరావు బాధ్యతలు నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శులుగా విహెచ్ - పొంగులేటి ఉన్నారు. సీడబ్ల్యుసీలో ఐఎన్‌ టియుసి అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. ఇలాఉండగా టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి - పార్టీకి రాజీనామా చేసి ఇటీవల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరిన ఎ. రేవంత్‌ రెడ్డికి తెలంగాణలో పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? అనేది కూడా చర్చ జరుగుతోంది.