Begin typing your search above and press return to search.

టీబీజేపీ ప్లాన్‌ బీ వ‌ర్క‌వుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   9 Nov 2018 8:40 AM GMT
టీబీజేపీ ప్లాన్‌ బీ వ‌ర్క‌వుట్ అవుతుందా?
X
అస్సాం - తిపుర రాష్ట్రాల ప్రయోగాలను తెలంగాణలో కూడా ప్రయోగిస్తామంటూ `ప్రభుత్వ ఏర్పాటులో మేం నిర్ణయాత్మకం కాబోతున్నాం' అని 'అధికారంలోకే వచ్చేస్తున్నాం' అని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవ‌ని - ఈ క్లారిటీ ఆ పార్టీలో కూడా ఉంద‌ని రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌లి కాలంలో...ఒక‌దాని వెంట ఒక‌టిగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నారు. ఆరు నెలల క్రితం నుంచి ఇతర పార్టీ నేతలను పార్టీ లోకి చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో ఆ పార్టీపై ఆదరణ లేదని ఎవరూ రావట్లేదు. రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ ఎస్‌ లో టికెట్లు రాని అసంతృప్తి వర్గీయులకు పార్టీ టికెట్‌ ఇద్దామనుకుంటే బాబు మోహన్‌ తప్ప మరెవరూ ఇటు కన్నెత్తి చూడలేదు. ఉమ్మడి కరీం నగర్‌ జిల్లా నుంచి ఇద్దరు మహిళా నేతలు పార్టీలో చేరుతారని ప్రకటనలొచ్చినా టీఆర్‌ ఎస్‌ ను వీడేది లేదని వారు ప్రకటించారు. కాంగ్రెస్‌ అగ్రనేత సతీమణి ఉదయం పార్టీలో చేరి సాయంత్రానికే జారుకున్నారు. ఇలా టీజేపీకి నిరాశ‌ - నిరీక్ష‌ణ మాత్ర‌మే మిగులుతోంద‌ని అంటున్నారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్న తెలంగాణ బీజేపీకి స‌మ‌ర్థులైన‌ అభ్యర్థులే కరువయ్యారని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లో వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారని పార్టీలో అసమ్మతి రాజుకుంది. హైదరాబాద్‌ - నిజామాబాద్‌ లో పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే అభ్యర్థులకు సహకరించేది లేదని కార్యకర్తలు ఖరాకండిగా చెబుతుండడంతో అధిష్టానం ఎటూ పాలుపోని స్థితిలో ఉంది. మ‌రోవైపు చేరిక‌లు కూడా ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డం... రోజురోజుకూ అన్ని ద్వారాలు మూసుకుపోతుంటే ఇప్పుడు మహాకూటమి వైపు ఆశగా చూస్తోంది. నామినేషన్ల గడువులోగా వెలువడుతుందని అనుకుంటున్న కూటమి అభ్యర్థుల ప్రకటన కోసం వేచిచూస్తోంది.

కూట‌మి పొత్తు - టికెట్ల కేటాయింపులో భాగంగా టికెట్లు రాని ఆయా పార్టీ నాయకులకు ఎర‌వేసేందుకు టీబీజేపీ సిద్ధంగా ఉందంటున్నారు. అలాంటి నేత‌ల‌ను చేర్చుకొని వారి తరఫున ఎంతైనా ఖర్చు చేయాలని చూస్తుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే రెండు విడతలలో 66 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ మరో 53 సీట్లను రిజర్వ్‌ లో పెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ - పాలమూరు - కరీంనగర్‌ జిల్లాలపై ఆశలు పెట్టుకుంది. అయితే, . రాష్ట్రంలో తనకంటూ ఓ పునాది లేని బీజేపీ ఇతర రాష్ట్రాల విజయాల వాపును బలం అనుకొని ఇక్కడ ప్రయోగాలు చేస్తే పార్టీ సొంత క్యాడర్‌ కూడా దెబ్బతిని అసలుకే ఎసరొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.