Begin typing your search above and press return to search.

కేసీఆర్‌-అమిత్ షాకు ఒకే స్కెచ్ తో చెక్ పెడ్తార‌ట‌

By:  Tupaki Desk   |   15 July 2017 5:08 AM GMT
కేసీఆర్‌-అమిత్ షాకు ఒకే స్కెచ్ తో చెక్ పెడ్తార‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను ఏక‌కాలంలో టార్గెట్ చేశారా? సొంత పార్టీలో గుర్తింపు కోరుకుంటూనే కొత్త‌ పోరాటానికి కాంగ్రెస్ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారా?అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీ లో సంస్థాగత పదవులు - ఎన్నికల సమయంలో సీట్లలో తమకు దక్కాల్సిన వాటా కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు గళమెత్తి వారంతా ఒక్కటయ్యారు. ఒకరికొకరు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు విశాల ప్రాతిపదికన కాంగ్రెస్ బీసీ ఫోరమ్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌ లోని ఒక హోటల్‌ లో పీసీసీ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు - కాంగ్రెస్ పార్టీ తరుపున గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన సుమారు 40 మంది బీసీ నేతలు పాల్గొన్నారు.

పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు - పొన్నాల లక్ష్మయ్య - ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కిగౌడ్ - మాజీ మంత్రి దానం నాగేందర్ - యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌ కుమార్ యాదవ్ - మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద - మాజీ ఎమ్మెల్యే ఎ.అనిల్‌ కుమార్ ఇత‌ర బీసీ నేత‌లు ఈ ప్ర‌త్యేక‌ స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్‌లోని కీల‌క బీసీ నేత‌లు నిర్ణ‌యించుకున్నారు. అటు పార్టీలో ప్రాధాన్యంపై అంతర్గతంగా కాంగ్రెస్ బీసీ ఫోరమ్ ప్రెజర్ గ్రూప్‌ లాగా పోరాడుతూనే, ఇటు ప్రభుత్వంపై కూడా బీసీల వాటా కోసం పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రకటనను వేగంగా అమలు చేయించేందుకు ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. దీనికోసం ఒకటి రెండు రోజుల్లో బీసీ కమిషన్‌ ను కలిసి బీసీ రిజర్వేషన్ పెంపుపై త్వరగా నివేదిక ఇవ్వాలని కోరడంతో పాటు, క్షేత్ర స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ వైపు బీసీలను ఆకర్షించేందుకు అమిత్‌ షా వ్యూహాలు రచిస్తున్నారని, మరోవైపు కేసీఆర్ కూడా ఎంబీసీల పేరుతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. అందుకే కాంగ్రెస్ కూడా బీసీల‌ను ఆకర్షించాలని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం అన్యాయమన్నారు. బీసీల నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదనే దుష్పచారాన్ని తెరదించుతామని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

పీసీసీ నాయకత్వంపై వ్యతిరేకత లేనప్పటికీ, గత ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షునిగా బీసీని చేసినందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని ఒక వర్గం చేస్తున్న వాదనను సమావేశంలో ముక్త కంఠంతో ఖండించారు. 1978 - 89లో చెన్నారెడ్డి మినహా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన ప్రతిసారి బీసీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఒక్క బీసీ గెలవలేదనే పేరుతో పార్టీలో ప్రాధాన్యతను తగ్గించడం తగదని, జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు పార్టీ పదవులు - సీట్లలో - అధికారంలో సరైన వాటా కల్పిస్తామనే విశ్వాసం కల్పిస్తేనే తిరిగి అధికారంలోకి వస్తామని అభిప్రాయపడ్డారు. బీసీలకు ఇచ్చిన సీట్లలో పార్టీకి బలం లేని పాతబస్తీ వంటివి కూడా ఉన్నాయని, ఈసారి బీసీ నేతలు బలంగా ఉన్న సీట్లతో పాటు, పార్టీ బలంగా ఉన్న స్థానాలను కూడా బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రభావం తక్కువ ఉన్న దక్షిణ తెలంగాణలో పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచిందని, ఉత్తర తెలంగాణలో బీసీలతో పాటు,ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు అదే స్థాయిలో ఓడిపోయారని విశ్లేషించారు.

బీసీలకు జరుగుతున్న అన్యాయాలు - అవమానాలపై పోరాటంతో పాటు, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా వాటా కోసం గత మూడు, నాలుగు నెలలుగా చర్చల తరువాత కాంగ్రెస్ బీసీ ఫోరమ్‌ ను ఏర్పాటు చేశారు. ఇది పార్టీకి వ్యతిరేకం కాదని ఫోరమ్ కోర్ కమిటీ ఛైర్మన్ నాగయ్య తెలిపారు. త్వరలో జెడ్‌ పిటిసి - ఎంపిటిసి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ తరువాత నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి సభలు నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లో సంస్థాగతంగా వాటాతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంలో పాలనా పరంగా బీసీల వాటా కోసం పోరాడుతామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిమితుల విధింపు ద్వారా బీసీ విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ - మరోవైపు గొర్రెలు - ఇస్త్రీ పెట్టెలు - వాషింగ్ మిషన్‌ లు పంచుతామంటూ వారిని టిఆర్‌ ఎస్ ప్రభుత్వం వెనక్కి నెట్టేస్తుందని వినయ్‌ కుమార్ విమర్శించారు.