Begin typing your search above and press return to search.

మోడీపై లాలూ కొడుకు పంచ్ లు వేశారు

By:  Tupaki Desk   |   1 Dec 2015 9:40 AM GMT
మోడీపై లాలూ కొడుకు పంచ్ లు వేశారు
X
తరచూ విదేశీ పర్యటనలు చేసే ప్రధానమంత్రి మోడీపై విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే. అంతర్జాతీయంగా భారత్ కీర్తి ప్రతిష్ఠల్ని పెద్ద ఎత్తున పెంచుతున్నా.. సొంత దేశంలో మాత్రం మోడీ పని తీరును పొగడటం మానేసి.. విమర్శలతో ఉతికి ఆరేయటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి ఫ్రాన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ.. భారత్ వాదనను బలంగా వినిపించటంతో పాటు.. అభివృద్ధి చెందిన దేశాల దుర్నీతిని అంతర్జాతీయ వేదిక మీద ఉతికి ఆరేశారు.

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల పాప ఫలితమే అన్న విషయం తెలిసినప్పటికీ దాని గురించి ప్రస్తావించే ధైర్యం గతంలో దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారు చేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. అందుకు భిన్నంగా భారత్ వాదనను.. వర్థమాన దేశాల ఆకాంక్షల్ని బలంగా వినిపించిన మోడీ.. తన పర్యటనను ముగించుకొని మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

అంతర్జాతీయ వేదిక మీద భారత్ వాదనను సమర్థవంతంగా వినిపించిన వాదనను వదిలేసిన లాలూ పుత్ర రత్నం.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి.. మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్న మోడీ.. తన బట్టలు ఉతుక్కునేందుకే ఢిల్లీకి వచ్చారంటూ వ్యాఖ్యానించారు. దేశ ప్రధానిని.. అందునా.. అంతర్జాతీయ వేదిక మీద భారత్ వాణిని బలంగా వినిపిపించి వచ్చినప్పటికీ అందుకు భిన్నంగా చులకన చేస్తూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.