Begin typing your search above and press return to search.

ఖర్చులో ‘బాబు’ అమ్మ మొగుళ్లంట

By:  Tupaki Desk   |   1 Sep 2016 5:25 AM GMT
ఖర్చులో ‘బాబు’ అమ్మ మొగుళ్లంట
X
మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మీద వచ్చే ఒక విమర్శను ఆయన సొంత పార్టీ నేతలు సైతం సమర్థించలేక సతమతమవుతుంటారు. బాబు పెట్టే కొన్ని ఖర్చులు చికాకులు తెప్పించటమే కాదు.. చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం సింక్ కావటం లేదన్న మాటలు వినిపిస్తుంటాయి. విభజన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నఏపీ రాష్ట్ర పరిస్థితి గురించి తన మాటల్లో తరచూ వాపోయే చంద్రబాబు.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారన్న పేరుంది.

తన కార్యాలయం సొగసులకు రూ.15 కోట్లకు పైనే ఖర్చుచేసిన చంద్రబాబు.. ఆ ఆఫీసులో పట్టుమని పది నెలలు కూడా ఉండని పరిస్థితి. ఈ రోజు కాకుంటే రేపొద్దున అయినా ఖాళీ చేసి వెళ్లాల్సిన హైదరాబాద్ సచివాలయంలో వసతుల పేరిట పెట్టిన ఖర్చు ఈ రోజు వృధా ఖర్చేనని చెప్పక తప్పదు. పదేళ్ల వ్యవధిలో హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందన్న విషయంపై స్పష్టత ఉన్నప్పటికీ.. మొదట్లో హైదరాబాద్ నుంచే పాలనా బండిని నడిపించాలని భావించిన బాబు.. ఆ తర్వాతి రోజుల్లో తన మైండ్ సెట్ ను మార్చుకున్నారు. అందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది మాత్రం ఏపీ ప్రజలే.

హైదరాబాద్ లోని సచివాలయం లోని సీఎం బ్లాక్ ను తన అభిరుచికి తగ్గట్లు తయారుచేసేందుకు పెట్టిన ఖర్చుతో ఒక మోస్తరు శాశ్విత భవనం వచ్చేసేదన్న అభిప్రాయం ఉంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా ఖర్చు చేసే తత్వం బాబులో చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రత్యేక విమాన ఏర్పాటు చేసుకోవటం కూడా ఈ కోవకు చెందిందే. అందుకే.. అవసరానికి మించిన ఖర్చు పెట్టటంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. బాబు అమ్మ మొగుడు లాంటి ఖర్చులు పెట్టే సర్కారుగా తాజాగా ఉత్తర ప్రదేశ్ నిలిచింది. గడిచిన నాలుగేళ్లలో ఆ రాష్ట్ర మంత్రులు పెట్టిన ఖర్చు ‘స్నాక్స్’ ఖర్చుగురించి తెలిసినోళ్లంతా షాక్ తింటున్నారు.

ఎందుకంటే.. యూపీ మినిస్టర్లు అతిధులకు.. అధికారులకు సమోసా.. గులాబ్ జామ్.. టీ లాంటి స్నాక్స్ కోసం పెట్టిన ఖర్చు అక్షరాల రూ.9కోట్లు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుచేసిన ఈ భారీ మొత్తం గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా లెక్కలు చెప్పటం గమనార్హం. 2012 మార్చి నుంచి 2016 మార్చి మధ్య కాలంలో అతిధులకు ఇచ్చిన స్నాక్స్ బిల్లు రూ.9 కోట్లు (కచ్ఛితంగా చెప్పాలంటే రూ.8.78కోట్లు)గా చెప్పారు. ఈ మొత్తాన్ని బ్రేకప్ చేస్తే స్నాక్స్ కోసం నాలుగేళ్లలో ఆరుగురు మంత్రులు ఒక్కొక్కరు రూ.21 లక్షలుఖర్చు చేయగా.. ఒక సహాయమంత్రి పెట్టిన ఖర్చే రూ.22.93లక్షలుగా తేల్చారు. ఈ ఖర్చు లెక్క విన్నవారంతా నోరు వెళ్లబెట్టే పరిస్థితి. అనవసర ఖర్చు పెట్టేస్తారన్న పేరున్న బాబుకే బాబు అన్నట్లు లేదూ ఈ యవ్వారం.