Begin typing your search above and press return to search.

మహానాడు వేదికగా టీడీపీలో రగిలిన అసంతృప్తి

By:  Tupaki Desk   |   27 May 2017 7:27 AM GMT
మహానాడు వేదికగా టీడీపీలో రగిలిన అసంతృప్తి
X
విశాఖ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో తొలిరోజే అలకలు, అసంతృప్తుల పర్వం మొదలైంది. ఆ పార్టీ నేత, సినీ నటి కవిత తొలిరోజే నిరసన గళం వినిపించారు. ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపైకి తనను ఆహ్వానించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో, మహానాడు ప్రాంగణం నుంచి ఆమె వెళ్లి పోయారు. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలకు తట్టుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తనను వేదికపై కూర్చోబెట్టారని... అధికారంలోకి వచ్చాక తనను పక్కనపెట్టి అవమానిస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. గత కొన్నాళ్లుగా కవిత పార్టీపై అసహనం వ్యక్తంచేస్తూనే ఉన్నా ఆమెను బుజ్జగించడానికి ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు. తాజా పరిణామాలతోనూ ఆమె విసుగు చెంది తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహానాడు ప్రాంగణంలో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని బాబు ప్రారంభించారు. టీడీపీ మహానాడుకు వస్తున్న పార్టీ కార్యకర్తలతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. పలు ప్రాంతాల నుంచి విశాఖకు వస్తున్న రైళ్లలో వేలాది మంది టీడీపీ మద్దతుదారుల విశాఖకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మహానాడు ప్రాంగణానికి వీరు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/