Begin typing your search above and press return to search.

ట్యాంక్‌బండ్ విగ్ర‌హాల‌ను ఏం చేస్తున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   24 April 2017 6:18 PM GMT
ట్యాంక్‌బండ్ విగ్ర‌హాల‌ను ఏం చేస్తున్నారో తెలుసా?
X
తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో మిలియన్ మార్చ్ సందర్భంగా, అనేక ఇత‌ర బహిరంగ సభల్లోనూ కేసీఆర్ చేసిన కామెంట్లు గుర్తుండే ఉంటుంది. ``ట్యాంక్ బండ్ పై ఉన్నవిగ్రహాల్లో అన్నీ సీమాంధ్రులవే. తెలంగాణ రాష్ర్టంలో వాటిని తొలగిస్తాం` అని ప్రకటించారు. ఆ క్ర‌మంలో ప‌లువురు ఉద్య‌మ‌కారులు విగ్ర‌హాల ధ్వంసానికి పాల్ప‌డ్డారు. కానీ తాజాగా ఏం జ‌రుగుతుందో తెలుసా? స‌దరు ధ్వంస‌మైన విగ్ర‌హాల‌కు మెరుగులు అద్దుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ప‌నికి ముందుకు సాగింది.

తెలుగు జాతి విశిష్ట‌త‌కు సాహిత్య, సాంస్కృతిక, కళా వైభవంతో పాటు పాలనలో విశిష్ట ఖ్యాతిని తెచ్చి పెట్టిన వైతాళికుల విగ్రహాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ఆస‌క్తిక‌ర‌మైన‌ నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహాలను పున‌రుద్ధ‌రించేందుకు కంక‌ణం క‌ట్టుకుంది. ఇప్ప‌టికే వాటి ప‌నులు ప్రారంభ‌మయ్యాయి కూడా. ఈ ప‌రిణామం ఇటు తెలంగాణ‌వాదుల్లో అటు సీమాంధ్రుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా, ట్యాంక్ బండ్ పై ఉన్నవిగ్రహాల్లో అన్నీ సీమాంధ్రులవే ఉన్నాయ‌ని పేర్కొంటూ వాటిని తెలంగాణ రాష్ర్టంలో తొలగిస్తామని ప్రకటించిన స‌మ‌యంలో ప‌లువురి నుంచి ఘాటు స్పంద‌న‌లే వ‌చ్చాయి. టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఒక‌డుగు ముందుకు వేసి ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకెళ్తామని ప్రకటించారు. దానిపై ప్రభుత్వమే కాదు..టీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించలేదు. అయితే తాజాగా కేసీఆర్ నిర్ణయం చూస్తే గ‌తంలో సెటిలర్లను అక్కున చేర్చుకుంటామని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌కారం చూస్తే...తెలుగు జాతి వైభవానికి సాహిత్య, సాంస్కృతిక, కళా వైభవంతో పాటు పాలనలో విశిష్ట ఖ్యాతిని తెచ్చి పెట్టిన వైతాళికుల విగ్రహాలపై ఏం నిర్ణయం తీసుకున్నార‌నే భావించాల్సి వ‌స్తోంది!