Begin typing your search above and press return to search.

ఆ సమీక్ష.. తెలంగాణ గవర్నరుకు తొలి పరీక్ష

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:52 AM GMT
ఆ సమీక్ష.. తెలంగాణ గవర్నరుకు తొలి పరీక్ష
X
తెలంగాణ గవర్నర్‌ గా ఇటీవలె బాధ్యతలు స్వీకరించిన సౌందరరాజన్ తమిళిసై క్రమక్రమంగా రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. ఉన్నతాధికారులు - వీసీలతో తొలి సమీక్షను ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ సమీక్ష రెండు నెలల క్రితమే జరగాల్సి ఉన్నా - చాలా వర్శిటీల వీసీల పదవీకాలం ముగిసే దశకు రావడం - కొత్త వీసీల నియామకాలు జరగాల్సి ఉండటంతో గవర్నర్‌ తో సమీక్ష వాయిదా పడుతూ వచ్చింది. అనూహ్యంగా కొత్త గవర్నర్ నియామకంతో ఆమె చేతులు మీదుగా సమీక్ష జరగబోతోంది. అయితే.. తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో సమస్యలు భారీగా ఉండడంతో ఆమె ఎలా డీల్ చేస్తారు.. ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు అన్నదాన్ని బట్టి ముందుముందు రాజకీయ అంశాలను ఎలా డీల్ చేస్తారన్న అంచనాలు వేయొచ్చని రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ఆమె పరిష్కారాలు చూపుతారా.. కఠినంగా వ్యవహరిస్తారా.. అధికారులు చెప్పిందానికి తలూపుతారా చూడాలి.

ఏటా కాలేజీలు పున:ప్రారంభించిన వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ భేటీ ఆనవాయితీ. ప్రధానంగా వర్శిటీల్లో - ఉన్నత విద్యాసంస్థల్లో - వృత్తి సాంకేతిక విద్యాసంస్థల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ర్యాగింగ్‌ ను అరికట్టడం - వార్షిక ప్రణాళిక రూపకల్పన - వివిధ వర్శిటీల్లో ఉన్న సమస్యలపై గవర్నర్ సమీక్షించేవారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల పాలకులే బాధ్యులుగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూనే - వారి పనితీరుకు సంబంధించి ప్రగతి సూచీలను కూడా నిర్దేశించేవారు. ఈ క్రమంలోనే నూతన గవర్నర్ తమిళిసై విద్యాశాఖ సమీక్ష నిర్వహించనున్నారు.

నిజానికి రాష్ట్రంలోని పలు వర్శిటీలు సీనియర్ ఐఎఎస్‌ ల ఇన్‌ ఛార్జిల పాలనలో కొనసాగుతున్నాయి. కొత్త వీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినా - సెర్చి కమిటీల్లో యూనివర్శిటీల నామినీల పేర్లు - ప్రభుత్వ నామినీల పేర్లు - యూజీసీ నామినీల పేర్లు జాబితాలు ప్రభుత్వానికి అందినా - ఎంపిక ప్రక్రియ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. రాష్ట్రంలో అన్ని యూనివర్శిటీలు ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నాయి. కొత్త కొత్త పరికరాలు - పుస్తకాలు కొనుగోలు మాట దేవుడెరుగు - ఏ నెలకు ఆ నెల జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితికి చాలా యూనివర్శిటీలు చేరుకున్నాయి. ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ టీచర్ల పెన్షన్లు ఇతర అవసరాలకు ముందుచూపుతో చేసిన ఫిక్సిడ్ డిపాజిట్ల నుండి కొంత నగదు విత్‌ డ్రా చేసి వాటితో పనులు చేసి - అనంతరం ప్రభుత్వ నిధులను తిరిగి ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తున్నారు. ఇలాంటి సౌలభ్యం కూడా లేని కొన్ని వర్శిటీలు నానా అగచాట్లు పడుతున్నాయి. ఈ ఏడాది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రారంభించినా - వాటిలో సైతం ఎవరూ చేరకపోవడంతో సమస్యలు పతాకస్థాయికి చేరాయి. బోధన సిబ్బంది - బోధనేతర సిబ్బంది రిటైర్ కావడమే తప్ప కొత్తగా నియమించిందేమీ లేదు. మౌలిక సదుపాయాల పెంపునకు - నూతన భవనాల నిర్మాణాలకు - మరమ్మతులకు - రీసెర్చి పేపర్లు - జర్నల్స్ కొనుగోలుకు సైతం అవకాశం లేకుండా పోయింది. మరో పక్క హాస్టళ్ల నిర్వహణ - నాన్ బోర్డర్ల తొలగింపు తలకు మించిన భారంగా మారింది. నాన్ బోర్డర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు - విద్యార్థులు - విద్యార్థి సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటనే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సమీక్ష నిర్వహిస్తున్న గవర్నరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. విశ్వవిద్యాలయాలను ఎలా గాడిన పెడతారన్నది అంతటా ఆసక్తికరంగా మారింది.