Begin typing your search above and press return to search.

దేవుడు లేడన్నందుకు చంపేశారు

By:  Tupaki Desk   |   21 March 2017 5:20 PM GMT
దేవుడు లేడన్నందుకు చంపేశారు
X
ఆస్తికుల‌ను గౌర‌వించాల్సిందే. అదే స్థాయిలో నాస్తిక‌త్వాన్ని సైతం గుర్తించాలి. గౌర‌వించాలి. కానీ అలాంటి స్పూర్తి కొర‌వ‌డ‌టం మ‌న‌దేశంలో పెద్ద‌ స‌మ‌స్య‌గా మారింది. దేవుడు లేడ‌నే త‌మ భావాల‌ను వెల్ల‌డించిన ఓ వ్య‌క్తిని చంపేశారు. ఈ దారుణం జ‌రిగింది పొరుగు రాష్ట్రమైన తమిళ‌నాడులో. కోయంబత్తూరులో స్క్రాప్‌ డీలర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల‌ హెచ్‌. ఫరూక్ ప్రముఖ ద్రవిడ నాయకుడు పెరియార్ రామస్వామి సిద్ధాంతాల‌ను పాటిస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘ద్రావిడార్‌ విద్యుతలై కళగం’ సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా దేవుడు లేడంటూ సోషల్‌ మీడియా వేదికలపై ప్ర‌చారం చేశాడు. అయితే ఈ ప్ర‌చారం గిట్టని వారికి చెందిన‌ నలుగురు దుండగులు గత వారం రాత్రి దాడిచేసి హత్య చేసిన విష‌యం క‌ల‌క‌లం సృష్టించింది.

ఇంత‌కీ ఫ‌రూక్ ఏమ‌ని ప్ర‌చారం చేశారంటే... 400 మంది హేతువాదులతో ఫరూక్‌ ‘వాట్సప్‌ గ్రూప్‌’ ఏర్పాటు చేసి త‌న అభిప్రాయాలు పంచుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే మార్చి 13వ తేదీన ఫేస్‌బుక్‌లో ‘నేను దేవుడికి శత్రువును, మతానికి శత్రువును, కులానికి శత్రువును, మానవత్వాన్ని విశ్వసించే మానవతావాదులకు మాత్రం మంచి మిత్రుడిని’ అని పోస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న‌కు ప్రాణ‌హాని హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయ‌ని ఆయ‌న తల్లిదండ్రులు, భార్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారు భ‌య‌ప‌డ్డ‌ట్లే ఫరూక్ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆయ‌న‌ మృతదేహాన్ని కోయంబత్తూర్‌ సీవరేజ్‌ ప్లాంట్‌ వద్ద పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో అర్షద్‌ అనే రియల్ ఎస్టేట్‌ వ్యాపారి లొంగిపోగా, సద్దాం హుస్సేన్‌ అనే మరో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ హ‌త్య‌ను హత్యను ముస్లిం నాయకులంతా ఖండించారు. మ‌రోవైపు ఫ‌రూక్ హ‌త్య‌పై ఆయ‌న తండ్రి హ‌మీద్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ కుమారుడు నాస్తిక‌వాది అయిన‌ప్ప‌టికీ తమను ఎన్నడూ నొప్పించలేదని తెలిపారు. ఫరూక్‌ తప్పా తమ ఇంట్లో అందరూ ఇస్లాం సంప్రదాయాన్ని ఆచరిస్తారని, అందరి విశ్వాసాలను గౌరవించే ఫరూక్‌ తమతో విభేదించి , తాను మాత్రం మతాలను, దేవుళ్లను నమ్మనని చెప్పేవాడని ఆయన తండ్రి హమీద్‌ వాపోయారు.

ఇదిలాఉండ‌గా మ‌నదేశంలో హేత‌వాదానికి గౌర‌వం లేక‌పోవ‌డంపై కొద‌రుపెద‌వి విరుస్తున్నారు. ఫ్రాన్స్, నార్వే, చైనాలో ఏ మ‌తాన్ని విశ్వ‌సించ‌ని వారి అభిప్రాయాల‌ను ఆయాదేశాలు గౌర‌విస్తున్నాయి. కానీ మ‌న‌దేశంలో అలాంటి ప‌రిస్థితులు లేక‌పోవ‌డం వ‌ల్లే గోవింద్‌ పన్సారే, ఎంఎంకే కల్బుర్గీ, నరేంద్ర దాబోల్కర్‌ లాంటి ప్రముఖ హేతువాదులు హత్యలకు గురయ్యారు. భారతీయుడు తన మతాన్ని వెల్లడించాల్సిందిగా ఒత్తిడిచేసే హక్కు భారత ప్రభుత్వానికి లేదంటూ ముంబై హైకోర్టు 2014లో తీర్పు చెప్పడం ఒక్క‌టే హేతువాద‌లు విష‌యంలో కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే చ‌ర్య అని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు.