Begin typing your search above and press return to search.

విపక్షాలు డ్రామా కంపెనీలా..?

By:  Tupaki Desk   |   26 July 2016 2:21 PM GMT
విపక్షాలు డ్రామా కంపెనీలా..?
X
దూకుడు రాజకీయాల్లో ఎవరిని ఏమైనా అనే పరిస్థితి. ఎదుటి పార్టీలకు కనీస మర్యాద ఇవ్వాలన్న ఆలోచన ఏ రాజకీయ పార్టీకి లేని పరిస్థితి. ఇక.. ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. అధికారాన్ని చేపట్టిన టీఆర్ ఎస్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే రెండాకులు ఎక్కువ చదివిన ఆ పార్టీ నేతలకు విరుచుకుపడటం వెన్నతో పెట్టిన విద్య. గడిచిన పాతిక నెలలుగా ఎప్పుడూ ఎదురుకాని చిత్రమైన పరిస్థితిని టీఆర్ ఎస్ నేతల అనుభవంలోకి వచ్చింది.

తమ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు చెప్పే దైర్యం చేయని దానికి భిన్నంగా తెలంగాణ రాజకీయ పక్షాలు.. ప్రజా సంఘాలు.. చివరకు కొంతమంది ప్రజలు సైతం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న గ్రామాల వారు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే.. మొత్తం ఎనిమిది ముంపు గ్రామాల ప్రజల్లో ఆరు గ్రామాల ప్రజలు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణరాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు.

నిజంగానే రెండు గ్రామాల ప్రజల వ్యతిరేకతే ఉండి ఉంటే.. జపాన్ పర్యటకు వెళ్లాల్సిన హరీశ్.. ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉండేవారు. అయితే.. అందుకు భిన్నంగా కొన్ని గ్రామాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో హరీశ్ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రజలకు మద్ధతుగా రాజకీయ పక్షాలు రంగంలోకి దిగటం.. వాతావరణం వాడీవేడిగా మారిపోవటంతో ఇప్పటివరకూ తమకు పట్టనట్లుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఒక్కసారిగా గళం విప్పారు.

గాఢంగా నిద్రపోతున్న వారు ఉలిక్కిపడి లేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. సరిగ్గా అలానే ఉంది మంత్రుల మాటల తీరు. ఫైర్ బ్రాండ్ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్.. తాజా పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపక్షాలు డ్రామా కంపెనీల్లా మారాయని.. గట్టిగా మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందని అనుకొంటున్నాయంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవాలని చూస్తే తాము ఊరుకోమని.. ఆరునూరైనా ప్రాజెక్టుల్ని కట్టి తీరుతామని తేల్చి చెప్పారు. ‘‘ప్రాజెక్టులు కట్టొద్దా? రైతులు బాగుపడొద్దా?’’ అంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. అధికారపక్షం చేసే ప్రతి మంచి కార్యక్రమానికి విపక్షాలు అడ్డు పడుతున్నాయన్నారు. తలసాని బాటలో నడిచిన పలువురు తెలంగాణ మంత్రులు విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉన్నట్లుండి మల్లన్నసాగర్ వ్యవహారం మంత్రులకు ఇప్పుడు గుర్తుకు రావటం ఏమిటి చెప్మా..?